ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత పది రోజులు వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి వెళ్ళటం వైసిపి వర్గాల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తోంది. ఈనెల 17న సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, హోం మంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే జగన్ ఢిల్లీకి వెళ్లడంతో టీడిపి విమర్శలు చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుకునేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని తీవ్ర విమర్శలు వచ్చాయి.
అసలు జగన్ ఢిల్లీకి ఎందుకు ? వెళ్లారు.. అసెంబ్లీలో ప్రకటన చేయాలంటూ కూడా పట్టుబట్టిన టీడిపి సభ్యులు సస్పెండ్ అయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు రెండు వారాలు కూడా అవకుండానే మళ్లీ జగన్ ఢిల్లీ వెళుతున్నారు. అసలు ఇప్పుడైనా ఆయన ఢిల్లీకి ఎందుకు ? వెళ్తున్నారు అన్న విషయం అధికారికంగా చెబుతున్నారా ? అంటే అదీ లేదు. పోనీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ జగన్ ఎలాగూ ప్రెస్ మీట్ పెట్టరు. జగన్ ఢిల్లీ వెళుతున్నారన్న ప్రకటన మాత్రం బయటికి వచ్చింది. దీంతో టీడిపి మళ్లీ లైన్ లోకి వచ్చింది.
వివేక హత్య కేసులో సిబిఐకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమైందని.. అందుకే జగన్ మళ్ళీ ఢిల్లీకి వెళుతున్నారన్న విమర్శలు మొదలైపోయాయి. అవినాష్ రెడ్డి నిజంగానే అరెస్టు అయితే అది కచ్చితంగా జగన్కు పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది. ఇక వైసిపి, జగన్ పై కేంద్రం ఎటాక్ మొదలైపోయింది అన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది. అదే జరిగితే వైసిపి నుంచి చాలామంది బయటకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైసిపి బలహీన పడిందన్న ప్రచారం కూడా జనాల్లోకి వెళ్లిపోతుంది.
ఇలా జరగకుండా ఉండాలంటే అవినాష్ రెడ్డి అరెస్టును కచ్చితంగా జగన్ ఆపాలని కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి తోడు టీడిపి వరుసగా 4 ఎమ్మెల్సీలను దక్కించుకోవడం.. ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహగానాల నేపథ్యంలో జగన్ కూడా మందస్తు వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతాయని.. జగన్ ఈ అంశంపై కూడా కేంద్ర పెద్దలతో చర్చిస్తారని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ వరుస ఢిల్లీ పర్యటనలతో వైసిపిలో ఒక రకమైన ఆందోళనకర వాతావరణం అయితే కనిపిస్తోంది.