ఏపీ మంత్రి విడుదల రజని అనవసరంగా ఇరుక్కుపోయారా ? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన తనకు ఎన్నికలకు ఐదారు నెలల ముందే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని… బోనస్గా మంత్రి పదవి ఇచ్చారన్న అభిమానమో ఏమో తెలియదు కానీ ఆమె అనవసరంగా బుక్ అయిపోయారు. తన నియోజకవర్గంలో మైనింగ్ ను ఇప్పటికే పలు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బంధువులకు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు చిక్కులు తప్పడం లేదు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నుంచి మంత్రి రజని ఎమ్మెల్యేగా ఉన్నారు.
చిలకలూరిపేట మండలం మురికిపూడిలో గత కొంతకాలంగా గ్రానైట్ తవకాలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూములు. ఈ భూముల్లో డీకే పట్టాలు రద్దు చేయకుండా.. ఎన్ఓసి తీసుకువచ్చి గ్రానైట్ తవ్వకాలు మొదలుపెట్టేశారు. దీంతో ఆయా భూములు సాగు చేసుకుంటున్న రైతులు అందరూ కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు మంత్రి విడుదల రజని, ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాపరెడ్డి, మరదలు శ్వేతారెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతులకు నోటీసులు జారీ చేసింది.
మొత్తం 20.50 ఎకరాల్లో గ్రానైట్ తవకాలకు ఎన్ఓసి ఇచ్చిన ఎమ్మార్వోకు సైతం నోటీసులు వెళ్లాయి. అలాగే అక్కడ రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్ఐకి కూడా హైకోర్టులు నోటీసులు జారీ చేసినట్టు తెలియ వచ్చింది. ఏది ఏమైనా ఏపీలో ఎక్కడ మైనింగ్ జరిగిన కడప నేతల పేర్లు బయటికి వస్తున్నాయి. ఇప్పుడు చిలకలూరిపేట లోను సీఎం జగన్ సమీప బంధువులే మైనింగ్ చేయడం.. దానికి మంత్రి రజినీ సహకారం కూడా ఉందన్న ప్రచారంతో ఆమె కూడా ఇరుక్కుపోయినట్లు అయింది.
ఇక దళితులకు చెందిన ఈ భూముల్లో వందల కోట్ల విలువచేసే గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇక రైతులకు తెలియకుండానే ఎన్వోసీ ఇవ్వటంపై కూడా హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల పదవ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు స్టేటస్ కో ఉత్తర్వులు జారీచేసింది. ఏది ఏమైనా రజని అధిష్టానం బంధువులు అని చూపించిన ఆ ప్రేమకు ఆమె కూడా బుక్ అయిపోయారు.