ఏపీలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల నుంచి టిడిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో సీఎం జగన్ సొంత జిల్లా కడపతో పాటు వైసిపి కంచు కోటలుగా ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ నుంచి వైసీపీ ఏకపక్ష విజయం సాధిస్తుందని అందరూ భావించారు.
అయితే కౌంటింగ్ చూస్తుంటే వైసీపీకి టిడిపి చుక్కలు చూపిస్తోంది. శుక్రవారం 8 రౌండ్ల లెక్కింపు పూర్తయింది మొత్తం 2, 45,000 ఓట్లు పోల్అవగా ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి వైసిపి 1800 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉంది. తుది ఫలితం వెల్లడి అయేసరికి మధ్యాహ్నం 3 అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 17 మంది ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా బరిలో 28 మంది ఉన్నారు.
మొత్తం 49 మంది అభ్యర్థుల పోటీ చేయగా 44 మంది అభ్యర్థులకు 600 లోపు ఓట్లు వచ్చాయి. వీళ్ళలో చాలామంది ఎలిమినేషన్ ప్రక్రియలో ఉండనున్నారు. వీళ్ళ ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత బిజెపి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇక రౌండ్ రౌండ్ కు ఫలితం చేతులు మారుతుంది. ముందు వైసిపి ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి లీడింగ్ లోకి వచ్చారు. ఇక గట్టి పోటీ ఇస్తారు అనుకున్నా పీడిఎఫ్ నేత పోతుల నాగరాజు చేతులు ఎత్తేశారు.
బిజెపి బలపరిచిన రాఘవేంద్ర కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుతానికి అయితే టిడిపి – వైసిపి మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్నా బిజెపి అభ్యర్థికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత వైసిపి అభ్యర్థి ఆధిక్యం ఐదువేల లోపు ఉంటే ఇక్కడ కచ్చితంగా టిడిపి విజయం సాధిస్తుందంటున్నారు. ఏదేమైనా వన్డే క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్లా ఈ పోరు తీవ్ర ఉత్కంఠగా మారింది.