ఆంధ్రప్రదేశ్లో బిజెపి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది… భవిష్యత్తులోనూ ఇంకెంత దారుణంగా ఉండబోతుందో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రూవ్ చేశాయి. ఏపీకి బిజెపి ఎంత అన్యాయం చేస్తుందో ? ఏపీ ప్రజల మనోభవాలతో ఎంత ఆట ఆడుకుంటుందో ? ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర విభజన జరిగాక కేంద్రం ఇచ్చిన హామీలను కూడా బిజెపి ఏమాత్రం నెరవేర్చడం లేదు. బిజెపి చేస్తున్న ఈ వంచనకు ఏపీ ప్రజలు అదిరిపోయే రీతిలో బుద్ధి చెప్పారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్సీ బీజేపీ నేత మాధవ్ పోటీ చేస్తే డిపాజిట్ గల్లంతయింది. 2017లో ఇదే సీటు ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించింది. అప్పుడు లెక్కలు వేరు.. టిడిపి తో పొత్తు ఉంది. అప్పుడు కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్నారు. పైగా విశాఖ ఎంపీగా బిజెపి నేత హరిబాబు ఉన్నారు. ఎమ్మెల్సీగా విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఇప్పుడు బిజెపి ఒంటరిగా పోటీలో ఉంది.
మిత్రపక్షంగా ఉన్న జనసేన కనీసం మద్దతుగా ఒక ప్రకటన కూడా చేయలేదు. సోము వీర్రాజు జనసేన మద్దతు మాకే అని ఎన్నిసార్లు డబ్బా కొట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇక మాధవ్ విషయానికి వస్తే మంచివాడు.. సౌమ్యుడు అన్న పేరు ఉంది. అలాంటి వ్యక్తికే డిపాజిట్ రాలేదు. కేవలం 11 వేల ఓట్ల దగ్గరే ఆగిపోయాడు. ఈ ఫలితం చూస్తే అయ్యో పాపం అనిపించక మానదు. బిజెపికి ఇది దారుణమైన పరాభవం అని చెప్పాలి.ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థికి కేవలం 5.75% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది గుడ్డిలో మెల్ల. ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో అయితే బిజెపి అభ్యర్థికి కేవలం 2.5% ఓట్లు వచ్చాయి.
మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లు కూడా రాకపోవడంతో బిజెపి డిపాజిట్లు కోల్పోయింది. అసలు గత సాధారణ ఎన్నికల్లోనే ఆ పార్టీ నుంచి ఎంతోమంది మహామహులు పోటీ చేశారు.కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి లాంటి వాళ్ళు పోటీ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద బిజెపికి ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లోను బిజెపికి డిపాజిట్లు గల్లంతు కావడంతో ఏపీలో ఆ పార్టీ నోటాతో పోటీపడి కూడా ఓడిపోవడం పక్కక్కా అని తేలిపోయింది. ఇలాంటి దారుణమైన డిజాస్టర్ రికార్డులు బిజెపి ఖాతాలో ఇంకెన్ని పడతాయో ? చూడాలి.