మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలోకి వచ్చేసారు గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న కన్నా చివరి క్షణంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో నరసరావుపేట నుంచి బిజెపి ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అనంతరం కన్నాను బిజెపి జాతీయ నాయకత్వం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. కన్నా పనితీరుపై అసంతృప్తితో ఆ పదవి నుంచి తప్పించేసి సోమ వీర్రాజుకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించారు. అప్పటినుంచి తీవ్ర అసంతృప్తితో ఉంటున్న కన్నా ఎట్టకేలకు కాషాయ కండువా పక్కన పెట్టేసి పసుపు కండువా కప్పుకున్నారు.
కన్నా గుంటూరు జిల్లాలో మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. జిల్లాలోని పెదకూరపాడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి పలువురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే కన్నా రాజకీయంగా ఎంత ఎదిగినా ఆయన తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి బద్ధ శత్రువు. అలాగే తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండే సామాజిక వర్గానికి తీవ్రమైన వ్యతిరేకి. అలాంటి వ్యక్తి టిడిపిలో ఇమడగలుగుతారా ? ఆయనను పార్టీలోకి తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనతో సఖ్యతతో ముందుకు వెళ్లగలుగుతారా.. అన్న ప్రశ్నలకు ఇప్పుడు ఆన్సర్లు లేవు. పైగా కన్నా వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.
ఆయనతో పాటు ఆయన చెప్పిన మరో వ్యక్తికి కూడా సీటు ఇచ్చేలా చంద్రబాబు దగ్గర ఒప్పందం కుదిరిందని కూడా అంటున్నారు. కన్నా గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలే ఆయనకు ఆప్షన్ అంటున్నారు. పెదకూరపాడు లో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. కన్నాకు సత్తెనపల్లి లేదా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడో ఒకచోట సీటు దక్కి అవకాశాలు ఉన్నాయని కన్నా వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో 90 శాతం మంది నేతలు కన్నా అంటే అస్సలు పడని వారే.
కన్నా కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలను నానా ఇబ్బందులకు గురి చేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం లో కన్నా బాధితులుగా లేని వారు ఎవరూ లేరు. అయితే ఇప్పుడు అలాంటి కన్నాను టిడిపిలో ఆహ్వానించి ఆయనతోపాటు ఆయన చెప్పిన వ్యక్తికి కూడా సీటు ఇవ్వడం ఏంటని ? పార్టీ సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కన్నాతో సుదీర్ఘకాలం పోరాటం చేసిన సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు 2014 ఎన్నికల్లోనే టిడిపిలోకి వచ్చి నరసారావుపేట ఎంపీగా గెలిచారు.
ఇప్పుడు కన్నా ఎంట్రీని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో రాయపాటికి అనుచరగణం ఉంది. కన్నా టిడిపి నుంచి పోటీ చేస్తే రాయపాటి వర్గంతో పాటు కన్నా వ్యతిరేకవర్గాలు.. కన్నాకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. రాయపాటి కూడా కన్నాకు సీటు ఇస్తే ఓడిపోతాడనే ఓపెన్గానే చెప్పేశారు. ఒకవేళ చంద్రబాబు రాయపాటి వర్గాన్ని కూడా సంతృప్తి పరచాలనుకుంటే ఆ కుటుంబంలో ఎవరో ?ఒకరికి సీటు ఇస్తే రాయపాటి శాంతించవచ్చు. లేకపోతే కన్నా ఓటమికి ఆయన నూటికి నూరు శాతం పని చేస్తారన్న ప్రచారం జిల్లా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
రాయపాటి మాత్రమే కాదు తెలుగుదేశంలో నలుగురైదుగురు సీనియర్ నేతలు కూడా కన్నా పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే.. కాపు కోటాలో, సీనియార్టీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అప్పుడు మళ్లీ మన మీద పెత్తనం చేస్తారని రగిలిపోతున్నారు. వీరంతా కూడా రేపటి ఎన్నికల్లో కన్నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సహకరించే అవకాశాలు అయితే కనబడటం లేదు. ఏదేమైనా కన్నా టిడిపి ఎంట్రీ గుంటూరు జిల్లా పార్టీ నేతలు చాలామందికి ఇష్టం లేదు.