ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై యువత, పట్టభద్రులు, నిరుద్యోగులు, మేథావులు ఎంత తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారో తాజాగా జరిగిన పట్టభద్రుల ఎన్నికలే చెపుతున్నాయి. సీఎం జగన్ కు కర్రకాల్చి వాత పెట్టేలా పట్టుభద్రుల తీర్పు ఉందన్న చర్చలు మొదలయ్యాయి. ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో జగన్ కు ప్రత్యక్షంగా కనిపిస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ సుధీర్ఘంగా నడుస్తోంది. అయితే ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినా పట్టభద్రుల విషయంలో మాత్రం వైసీపీ అభ్యర్థులు ఓటమిబాటలో ఉన్నారు. అయితే ఈ సారి ప్రైవేటు టీచర్లకు కూడా ఓటు హక్కు ఇవ్వడంతో వారిని వైసీపీ వాళ్లు తెలివిగా మ్యానేజ్ చేసుకుని మరీ ఓట్లు వేయించుకున్నారని.. అందుకే టీచర్ల నియోజకవర్గాల్లో రెండు చోట్లా వైసీపీయే గెలుపొందిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఇక గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల విషయానికి వస్తే రెండు చోట్ల టీడీపీ బంపర్ మెజార్టీతో గెలుపుబాటలో ఉంది. మరో చోట కూడా ఆధిక్యంలో ఉంది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 15 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇక ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వేపాడ చిరంజీవి 5 వ రౌండ్ ముగిసేసరికి 23 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థుల గెలుపు లాంఛనమే అంటున్నారు.
విచిత్రంగా పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలోనూ ఇప్పుడు టీడీపీ లీడింగ్లోకి వచ్చేసింది. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ టీడీపీ అభ్యర్థి భుమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఏదేమైనా వైసీపీ టీచర్స్ నియోజకవర్గాల్లో గెలిచిందంటే అందుకు కారణం.. ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఓటు హక్కు ఇచ్చి.. ఆ మేనేజ్మెంట్లను ఏదోలా తమ వైపునకు తిప్పుకోవడమే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక యువత, గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగుల్లో జగన్ సర్కార్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికల ఫలితాల ట్రెండ్సే చెపుతున్నాయి. ఈ ట్రెండ్ 2024 ఎన్నికల్లోనూ రిపీట్ అయితే వైసీపీ సర్కార్ ఓడి.. జగన్ గద్దె దిగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.