ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల్లో పనితీరు సరిగా లేని నేతలకు జగన్ పెద్ద షాక్ ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే అంతర్గత సర్వేల్లో 70 మంది వరకు ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం సరిగా లేదని.. ఈ ఏడాది కాలంలో వారు మారకపోతే జగనే వారిని మార్చేందుకు సిద్ధమవుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే గత ఎన్నికల్లో వైసిపి ఏకంగా 22 లోక్సభ స్థానాలు గెలుచుకుంది.నాలుగేళ్లు అవుతున్న వైసీపీ ఎంపీలు ఏం ? సాధించారు అని ప్రశ్నించుకుంటే వారిలో చాలా మంది డమ్మీలుగా మిగిలిపోయారు తప్ప కనీసం నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోయారు.
లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి ఒకరిద్దరు ఎంపీలను వదిలేస్తే అసలు పార్లమెంట్లో కూడా రాష్ట్ర హక్కులపై ప్రశ్నించిన వారే లేరు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గెలిచిన ఏడాదికే పార్టీకి దూరమైపోయారు. వైసీపీ ఎంపీలు పూర్తిగా డమ్మీలు అయిపోయారు. ఎమ్మెల్యేలు వారిని అస్సలు లెక్కచేయడం లేదు. తమ అనుమతి లేనిదే కనీసం నియోజకవర్గం లో కూడా తిరగవద్దని చెప్పేస్తున్నారు. ఇక ఎంపీలు చాలామందికి వచ్చే ఎన్నికల్లో జగన్ టిక్కెట్లు ఇవ్వరని తెలుస్తోంది.
ఇప్పుడున్న అంచనాల ప్రకారం చూసిన పదిమందికి పైగా వైసిపి ఎంపీలకు సీట్లు దక్కే పరిస్థితి లేదు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీపై ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఇక రఘురామ కృష్ణంరాజు కూడా పార్టీకి ఎప్పుడో దూరమయ్యారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను ఈసారి అసెంబ్లీకి పోటీ చేయించడం లేదా పక్కన పెట్టేయడం చేస్తారని అంటున్నారు.
అనంతపురం ఎంపీ రంగయ్య కూడా కళ్యాణదుర్గం నుంచి అసెంబ్లీకి లేదా సైలెంట్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా రాజకీయాల పట్ల అంత ఆసక్తితో లేరని.. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరని అంటున్నారు. కాకినాడ ఎంపీ వంగా గీత పిఠాపురం అసెంబ్లీపై కన్నేశారు. అమలాపురం ఎంపీ చింత అనురాధ సైతం గన్నవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అనకాపల్లి ఎంపీ సత్యవతికి ఈసారి సీటు రాదని ప్రచారం జరుగుతోంది. తిరుపతి ఎంపీ ఈసారీ అసెంబ్లీకి పోటీ చేస్తే అక్కడ కూడా జగన్ లోక్సభకు కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సి రావచ్చు.
విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా ఈసారి చీపురుపల్లి అసెంబ్లీపై కన్నేశారు. విశాఖ ఎంపీ ఎంవీబీ సత్యనారాయణ కూడా విశాఖ తూర్పు నుంచి అసెంబ్లీకి. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు కాక జగన్ మెచ్చని ఎంపీలు ఎవరైనా ఉంటే వాళ్లకు కూడా షాక్లు తప్పేలా లేవు.