ఏపీ అసెంబ్లీలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి జరిగినట్టు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వెంటనే వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ పోడియం ముందు నిరసన తెలుపుతున్న టీడిపి ఎమ్మెల్యేలు డోల బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేసినట్టు టీడిపి సభ్యులు ఆరోపిస్తున్నారు.
టీడిపి సభ్యులు ఆరోపిస్తున్న దాని ప్రకారం ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే పై డోల బాల వీరాంజనేయ స్వామిపై, వైసీపీకి చెందిన వీఆర్ ఏ లీజా, సుధాకర్ బాబు దాడి చేశారు. అలాగే రాజమండ్రి రూరల్ టీడిపి ఎమ్మెల్యే గోరంట్ల బచ్చయ్య చౌదరిపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిపై వైసీపీ సభ్యులు దాడి చేసినట్టు చెప్పారు.
75 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆరుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన బుచ్చయ్యపై మాజీ మంత్రి వెల్లంపల్లి దాడికి పాల్పడ్డారని అచ్చన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో ఒకటి రద్దు చేయాలంటూ తమ వాయిదా తీర్మానం ఇస్తే దానికి స్పీకర్ అంగీకరించలేదని.. మేము పోడియం దగ్గరికి వెళ్లి నిరసన తెలిపాం.. మేం తప్పు చేసినట్టు స్పీకర్ భావిస్తే మమ్మల్ని సస్పెండ్ చేయాలి. అంతేకానీ వైసీపీ ఎమ్మెల్యేలు తమపై దాడి చేయడం ఏంటని అచ్చెన్న ప్రశ్నించారు. మరి ఇంత దారుణంగా ప్రత్యక్షంగా దాడి చేసి శాసనసభ పరువును వైసీపీ ప్రభుత్వం తీసేయటం సిగ్గుచేటని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు పోడియం వద్దకు వైసిపి ఎమ్మెల్యేలు రావలసిన అవసరం ఏముందని ? ఏపీ శాసనసభ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని ఆయన ఫైర్ అయ్యారు. వైసిపి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నాటి నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ విధంగా దాడి చేసిందని అచ్చెన్న ధ్వజమెత్తారు. ఏదేమైనా శాసనసభ సాక్షిగా వైసిపి ఎమ్మెల్యేల తీరును టీడిపి ఎమ్మెల్యేలపై దాడి చేయటాన్ని ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు.