వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా క్లారిటీతో ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారుపరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ప్రజలు అభివృద్ధి కోరుకుం టున్నారనేది దాదాపు స్పష్టమైన దరిమిలా… విజనరీ వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పనలతోపాటు పీ-4 వ్యూహాన్ని అమలు చేస్తానని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.
ఇది ప్రజల్లోకి జోరుగా వెళ్తోంది. పోవర్టీ-ప్రియార్టీ-ప్రోగ్రెసివ్-పంపిణీలు.. అనే నాలుగు అంశాలను ప్రధానం గా చేసుకుని చంద్రబాబు చేస్తున్న పీ-4 ప్రయోగం సక్సెస్ అవుతుందనే అంచనాలు వస్తున్నాయి. ముఖ్యంగా.. యువతను లక్ష్యంగా చేసుకుని ఉపాధి, ఉద్యోగ కల్పన అనే రంగాలకు చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది సక్సెస్ అయితే.. ఇక, పల్లెలు, పట్టణాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అంటున్నారు.
ఇప్పటి వరకు.. చంద్రబాబు అంటే.. వ్యూహానికి కట్టుబడిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబా బు అంటే.. విజన్ అనే పేరు ఉంది. అయితే.. గత 2019 ఎన్నికల సమయంలో ఈ విజన్పైనే వైసీపీ దెబ్బ కొట్టింది. విజన్ అంటే.. కేవలం డిజిటల్ మాత్రమేనని చెబుతూ… అమరావతిని ప్రొజెక్టు చేశారు. కానీ, ఇప్పుడు అదే విజన్ టీడీపీకి వెన్నెముకగా మారనుంది. నిజానికి గత ఎన్నికల్లో చంద్రబాబు విజన్ను ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారు.
పసుపు=కుంకుమ వంటి పంపకాలకు సంబంధించిన కార్యక్రమాలను తీసుకువెళ్లారు. అయితే.. అది ఫెయిల్ అయింది. ఈ నేపథ్యంలో యువత, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్న విజన్ వైపు తాజాగా ఆయన అడుగులు వేస్తున్నారు. దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి సభలో రజనీకాంత్ కూడా విజన్కు పెద్దపీట వేయడం..చంద్రబాబు విజన్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 పొజిషన్కు తీసుకువెళ్తుందని చెప్పడం వంటివి కలిసి వచ్చే అంశాలుగా మేధావులు అభిప్రాయపడుతున్నారు.