నటసార్వభౌముడు.. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఎల్లలు దాటించిన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నందమూరి బాలకృష్ణ. తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా హవా నడిపిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. బాలయ్య నటించిన తొలి సినిమానే గవర్నమెంట్ బ్యాన్ చేసింది.
అదేంటి బాలయ్య సినిమాను నిజంగా గవర్నమెంట్ బ్యాన్ చేసిందా ? ఇది ఎప్పుడు వినలేదే అనుకుంటున్నారా ? కానీ ఇది నిజమే. బాలకృష్ణ నటుడిగా తెలుగు తెరకు పరిచమైన తొలి చిత్రం తాతమ్మకల. నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాని ఎన్టీఆర్ సొంత బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్పై నిర్మించారు. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ , అలనాటి అగ్ర నటి భానుమతి, హరికృష్ణ, బాలకృష్ణ, రాజబాబు, చలపతిరావు వంటి తదితరులు ఈ సినిమాలో నటించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కుటుంబ నియంత్రణపై విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. ఇద్దరు ముద్దు.. ముగ్గురు వద్దు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. అలాంటి సమయంలోనే ఇక కాంగ్రెస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ సినిమాని తీశారు. ఇందులో భాగంగా కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్, భానుమతి పాత్ర ద్వారా కొన్ని డైలాగులు వూడా చెప్పించారు. 1974, ఆగస్టు 30న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అదే సమయంలో ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. దాంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తాతమ్మకలను రెండు నెలలు బ్యాన్ చేసింది. ఇక తర్వాత పలుమార్పులు చేయడంతో మళ్లీ 1975 జనవరి 8న ఈ సినిమాను రిలీజ్ చేశారు. విచిత్రం ఏంటంటే.. ప్రభుత్వం నిషేధానికి గురై రెండోసారి విడుదలైన ఈ చిత్రానికి ఉత్తమ కథకు నంది అవార్డు రావడం గమనార్హం.