ఏపీలో గత నాలుగేళ్ల కాలంలో ఏ ఎన్నికలు జరిగిన టీడిపి అసలు ప్రత్యక్షంగా గెలిచిన దాఖలాలు లేవు. మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ ఏ ఎన్నిక జరిగిన వైసిపి దెబ్బకు టీడిపికి చుక్కలు కనపడేవి. అసలు టిడిపి అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికలలో చాలాచోట్ల నామినేషన్ వేసేందుకు కూడా భయపడేవారు. మాచర్ల, పుంగనూరు, పులివెందుల లాంటి చోట్ల టీడిపి నుంచి నామినేషన్ వేసేందుకు కూడా ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు బయటకు రాలేని పరిస్థితి.
అలాంటి సమయంలో అనూహ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం.. ఏమాత్రం అంచనాలు లేకుండా టీడిపి అభ్యర్థులను నిలబెట్టడం.. మూడు స్థానాలలోనూ టీడిపి భారీ మెజార్టీలతో విజయం సాధించటం.. వైసిపికి సరైన సమయంలో గ్రాడ్యుయేట్లు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలలో గెలుపు ఓటమిలు అనేవి సహజం. అయితే తెలంగాణలోలా మరి అసలు ప్రధాన ప్రతిపక్షం అన్నదే ఉండకూడదు.. నాకు కనపడకూడదు అన్న ధోరణితో పాలన చేయటం ఎంత మాత్రం సరికాదని.. ఈ ఎన్నికలే నిరూపించాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నాలుగేళ్ల వైసిపి పాలన అంతా అసలు ప్రతిపక్షం అనేది ఎక్కడా కనపడకూడదు.. ఏ ఎన్నికల్లోను ప్రతిపక్షం అనేది విజయం సాధించకూడదు అన్న ధోరణితోనే ఎక్కువగా నడిచిందన్న టాకే ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా.. అసలు ప్రతిపక్షం అనేది లేకపోయినా.. ప్రజాస్వామ్యం మనగడకే ప్రమాదం అని ప్రజాస్వామ్యవాదులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ అనగదొక్కాలని చూస్తే ప్రజలు సరైన సమయంలో చాచిపెట్టి కొట్టడంతో పాటు.. తగిన గుణపాఠం చెబుతారు అనేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనంగా నిలిచాయి.
ఇక గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో విజయం సాధించేందుకు అధికార పార్టీ ధన బలంతో పాటు అధికార బలగాన్ని, యంత్రంగాన్ని మొత్తం ఉపయోగించుకుందన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. అయినా టిడిపి అభ్యర్థులు రెండు చోట్ల బంపర్ మెజార్టీతో గెలిస్తే… జగన్ కంచుకోట పశ్చిమ రాయలసీమలోనూ 7 వేల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఏదేమైనా గ్రాడ్యుయేట్లు నిజంగా ప్రతిపక్షాలకు ఊపిరి పోసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు అని వైసిపి కి చెందిన వారే నర్మగర్భంగా అంగీకరిస్తున్నారు. ఇది నిజం కూడా..!