ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి చుక్కలు చూపించేశాయి. ప్రధాన ప్రతిపక్షం టీడిపి అస్సలు ఎవరూ ఊహించిన విధంగా పుంజుకుంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ మూడు స్థానాల్లోనూ విజయం సాధించింది. తూర్పు రాయలసీమ, ఉత్తరంధ్రలో అయితే 38 వేల పైచిలుకు మెజార్టీలతో టీడిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అయితే వైసిపి ఈ ఓటమిని హుందాగా అంగీకరించి ఉంటే బాగుండేది. ఈ ఫలితాలపై వైసీపీ కీలక నేత సజల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బండిల్స్ కట్టడంలో లోపాలు జరిగి ఉంటాయని చెప్పటం చాలా కామెడీగా ఉంది.
అసలు వైసిపి ఎందుకు ? ఓడిపోయింది ఎక్కడ ఓడిపోయింది ? అన్నదానపై ఆలోచన చేసుకొని ఉంటే బాగుండేది. అయితే ఈ ఎన్నికలలో వైసీపీకి సొంత పార్టీ కార్యకర్తల దూరం జరిగారు. మంత్రులకు జగన్ బాధ్యతలు ఇచ్చినా వారు సరిగా పట్టించుకోలేదు. గత సాధారణ ఎన్నికలలో ఎంతోమంది జగన్ వీరాభిమానులు పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేశారు. అధికారంలోకి వచ్చాక వారిని కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు ఇప్పటికీ ఉండనే ఉన్నాయి.
ఇక జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అయితే కార్యకర్తలకు ప్రత్యేకంగా కలిగిన లబ్ధి అంటూ ఏదీ లేదు. దీంతో వారు ఈ ఎన్నికలను ప్రధాన అస్త్రంగా భావించి కావాలని వైసిపికి వ్యతిరేకంగా ఓటేసి ఓడించారని చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా చివరికి కుప్పంలో కూడా వైసిపి విజయం సాధించింది. ఏ ఎన్నికల్లోను మాకు తిరిగి లేదని వైసీపీ అతి ధీమాకు పోయింది. అదే ఇక్కడ పార్టీ ఓటమికి కారణం అయింది.
ఇక వైసిపికి సోషల్ మీడియాలో ఎంతోమంది వారియర్స్ ఉన్నారు. వాళ్లు కూడా ఎన్నికలను పట్టించుకోలేదు. ఇక జగన్ ఎంతోమందికి సచివాలయం ఉద్యోగాలతో పాటు వాలంటీర్ జాబులు ఇచ్చారు. వీళ్ళలో చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వీళ్ళు కూడా వైసిపికి ఓటు వేయలేదని ఆ పార్టీ ప్రాథమిక నివేదికలో తేలిందని సమాచారం. వాలంటీర్లు తమ గౌరవ వేతనం 10,000 చేస్తారని ఎన్నో ఆశలతో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్న ఇప్పటికీ వాళ్ళు 5,000 వేతనంతోనే సరిపెట్టుకుంటున్నారు.
ఇక సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయ్యాక వారిని పర్మినెంట్ చేసేందుకు రకరకాల నిబంధనలు పెట్టారు. ఇవన్నీ కూడా వారికి నచ్చలేదు. పైగా వారికి భవిష్యత్తులో ఉద్యోగ ఉన్నతి ఉంటుందన్న ఆశలు కూడా లేవు. ఇవన్నీ వాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు కారణంగా కనిపిస్తున్నాయి.