“ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఏం జరిగిందో ఏమో!“ ఇదీ.. ఇప్పుడు వైసీపీ నేతలను కుదిపేస్తున్న ప్రధాన వాదన. దీనికి కారణం.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తీవ్ర పరాజయం ఎదుర్కొంది. నిజానికి నాలుగు స్థానికసంస్థల కోటాలోను. .. రెండు ఉపాధ్యాయుల కోటాలోనూ ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. అయినప్పటికీ.. గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకుంది.
ఇది వైసీపీకి తీవ్ర ఇబ్బందిగాను.. వైనాట్ 175 నినాదానికి.. పెను దెబ్బగానూ పరిణమించిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో కింకర్తవ్యం అంటూ.. అంతర్మథనం చెందుతున్నారు. స్థానిక కోటాలో విజయానికి కారణం.. తమ వారే.. (అన్ని కార్పొరేషన్లు.. స్థానిక సంస్థల్లోనూ) ఉన్నారు. దీంతో అక్కడ విజయం నల్లేరుపై నడకే అన్నట్టుగా సాగింది. ఇక ఉపాధ్యాయుల పట్టబధ్రుల స్థానాలతో వైసీపీకి సంబంధం లేదు.
అయినప్పటికీ.. వైసీపీ మద్దతు దారులను రంగంలోకి దింపింది. అదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా కాకుండా.. ఎవరికి వారే బరిలో నిలిచారు. ఇది వైసీపీ వ్యూహమనే చెబుతారు. సో.. దీంతో ఆ సంఘాలు చతికిలపడి.. వైసీపీ విజయం దక్కించుకున్నట్టు అయింది. అయితే.. ఈ ఆరు స్థానాలు దక్కించుకున్నా.. ఆ మూడు స్థానాల్లో పరాజయమే..ఇప్పుడు వైసీపీని నిలువునా వణికిస్తోందన్నది వాస్తవం.
అసలు వ్యూహం ఏంటి..?
వైసీపీ విషయాన్ని తీసుకుంటే..రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఆ పార్టీ వచ్చే ఎన్ని కలకు ముందు జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అంతే ఇంపార్టెంట్గా భావించింది. దీంతో స్తానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం దక్కించుకునే వ్యూహాత్మకంగా ఎదురు నిలిచి పోరాడాలని దిశానిర్దేశం చేసింది. కానీ, నాయకత్వం సూచనలను క్షేత్రస్థాయిలో నేతలు పట్టించుకోలేదు. దీనికితోడు గ్రాడ్యుయేట్లు కూడా చీలిపోయారు. ఫలితంగా.. వైసీపీకి తీవ్ర పరాజయం దక్కిందని అంటున్నారు.