ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి నేతల్లో గత రెండు మూడు నెలలుగా సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వరుసగా వెలువడుతున్న సర్వేలతోపాటు వైసీపీ అంతర్గత సర్వేల్లోనూ ప్రభుత్వం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత… అధికార పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావం ఇవన్నీ తమను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు వచ్చేస్తాయి అన్న ఆనంద ఉత్సాహాల్లో అయితే మునిగి తేలుతున్నారు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ? ఎవరి అంచనాలు ఎలా ఉన్నా తెలుగుదేశం అధికారంలోకి రావాలంటే చాలా నియోజకవర్గాల్లో మరి కాస్త కష్టపడాల్సి ఉంది.. ఇది నిజం.
అయితే నిత్యం ప్రజల్లో ఉంటూ తమ తమ నియోజకవర్గాల్లో కష్టపడే నాయకులు ఇప్పటికే గెలుపు బాటలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కొందరు బలమైన నేతలు అయితే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగినా బంపర్ మెజార్టీతో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లిస్టులో చాలామంది నేతలు ఉన్న కొందరికి మాత్రం ఇప్పటికే ఏకంగా 25 వేలకు మించిన మెజార్టీ పలు సర్వేలో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నారు. ఇందుకు వేయని ఎత్తులు లేవు.. పన్నని పన్నాగాలు లేవు.
పైగా మంత్రి పెద్దిరెడ్డిని అక్కడ ప్రత్యేకంగా ఇన్చార్జిగా పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో నానా నానా రచ్చ చేస్తేనే తప్ప వైసిపి గెలవలేదు. అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా మరోసారి చంద్రబాబు విజయం సాధించబోతున్నారు. ఇక పాలకొల్లులో ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించిన నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్ గెలుపు ఖరారు అయింది. వచ్చే ఎన్నికల్లో ఆయన 25 వేల మెజార్టీతో వరుసగా మూడోసారి విజయం సాధించటం పక్కాగా కనిపిస్తోంది. ఇక్కడ వైసిపికి బలమైన అభ్యర్థి లేకపోవడం కూడా రామానాయుడుకి కలిసి రానుంది.
అలాగే విజయవాడ తూర్పు నుంచి పార్టీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ వరుసగా ముచ్చటగా మూడోసారి విజయం సాధించనున్నారు. మొన్న ఎన్నికల్లోనే ఏకంగా 16 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన గద్దెకు ఈసారి అవినాష్ లాంటి యువకుడు ప్రత్యర్థిగా ఉన్నా కూడా తూర్పులో గద్దేకు తిరుగులేని విజయం లభించడం ఖాయంగా ఉందని తెలుస్తోంది. అవినాష్ నిత్యం ప్రజల్లో ఉంటున్నా గద్దెకి ఉన్న క్లీన్ ఇమేజ్ తో పాటు రాజధాని మార్పు ప్రభావం.. గద్దె చేసిన అభివృద్ధి పనులు ఆయనకు కలిసి రానున్నాయి. మొన్న అంత వ్యతిరేకతలోనే బంపర్ విక్టరీ కొట్టిన గద్దెకు ఈ సారి గెలుపు నల్లేరుమీద నడకే కానుంది.
ఇక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వరుసగా రెండుసార్లు గెలిచిన బెందాళం అశోక్ వచ్చే ఎన్నికల్లో 25 నుంచి 30 వేల మెజార్టీతో మూడో గెలుపు నమోదు చేయనున్నారు. అశోక్ను నియోజకవర్గంలో ఢీకొట్టే బలమైన ప్రత్యర్థి అంటూ ఎప్పటికీ ఎవరూ లేరు. అలాగే ఇప్పటికే విశాఖ తూర్పు నుంచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన వెలగపూడి రామకృష్ణ బాబు కూడా ఈసారి ఏకంగా 30 నుంచి 40 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించమన్నారు. రామకృష్ణ బాబుకు 2014లోనే ఏకంగా 48 వేల బంపర్ మెజార్టీ వచ్చింది.
అదే జనసేనతో పొత్తు ఉంటే ఆయన మెజార్టీ 50 నుంచి 60 వేల మధ్యలో ఉంటుందని అంటున్నారు. జగన్ ఎన్ని ప్లాన్లు వేసినా తూర్పులో ఆ పాచికలు పారేలా లేవు. అలాగే జనసేన – టిడిపి పొత్తు ఉంటే పైన తెలిపిన ఐదుగురు టిడిపి నేతలు మెజార్టీ 35 నుంచి 50 వేల పైనే ఉండొచ్చని లెక్కలు వేస్తున్నారు. ఏదేమైనా ఈసారి ఈ ఐదుగురు నేతల గెలుపును ఆపటం ఎవరి తరం కాదు.