ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు పార్టీ మారడం ఖాయమైందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారైందని అంటున్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న ఆయన అక్కడ రచ్చరచ్చ చేసి వైసీపీలోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే గిద్దలూరు నుంచి పోటీ చేశారు. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఏపీలో సీఎం జగన్కు పులివెందులలో వచ్చిన మెజారిటీ అంతా ఇంతా కాదు. ఆయనే ఎమ్మెల్యేల్లో ఫస్ట్ ఉన్నారు.
ఆయన తర్వాత స్థానంలో అన్నారాంబాబు నిలిచారు. అయితే, ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించారు. కానీ, అది రాలేదు. దీంతో కొన్నాళ్లుగా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పైగా విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల స్థాయిలో అయితే కాదు. దీంతో పార్టీ అధిష్టానం అన్నాను కూడా పక్కన పెట్టేసింది.
ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల్లో అన్నాకు టికెట్ ఇవ్వొద్దంటూ.. వైసీపీలోనే కొందరు రెడ్డి నేతలు.. పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. ఆయన వల్ల తామునష్టపోతున్నామనేది వారి వాదనగా కూడా ఉంది.ఇది.. గత రెండేళ్లుగా ఎమ్మెల్యే అన్నాకు.. రెడ్డి నేతలకు మధ్య అగాధాన్ని పెంచింది. అన్నా కార్యక్రమాలకు వారు వెళ్లరు. వారు ఏర్పాటు చేసే కార్యక్రమాలపై అన్నా నిప్పులు చెరుగుతారు. పైగా.. అన్నా తమను పట్టించుకోలేదనేది మెజారిటీ నేతల అభిప్రా యంగా ఉంది.
ఈ క్రమంలోనే అన్నా అంటే.. రెడ్డి వర్గం దాదాపు దూరం పెట్టేసింది. ఇక, అధిష్టానం ఏం జరుగుతుందో చూద్దాంలే అని నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. ఈ పరిణామాలతో ఇక, వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కష్టమని భావించిన అన్నా.. తన దారి తాను చూసుకున్నారు. త్వరలోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు ఆయన అనుచరులు. దీనికి సంబంధించి తెరచాటున అన్నీ అయిపోయాయని.. ముహూర్తం కూడా ఖరారైందట.
ఈనెల 14న మచిలీపట్నంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభలో అన్నా పార్టీ మారిపోతారని.. పవన్తో చేతులుకలుపుతారని.. అంటున్నారు. దీనిపై నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చ సాగుతుండడం గమనార్హం. మరోవైపు.. అన్నాఇంటి పరిసరాల్లోనూ .. వైసీపీ జెండాలు కనిపించడం లేదు. దీంతో అన్నా పార్టీ మార్పు ఖాయమని అంటున్నారు. ఏదైనా ప్రత్యేక సందర్భం ఎదురైతే తప్ప.. ఆయన మార్పుకు ఎలాంటి తేడా రాదని అంటున్నారు.