ఒక్కటి మాత్రం నిజం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకుంటుంది. రాజధాని విషయంలో… అటు జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం విషయంలో ఏమాత్రం సహాయ సహకారాలు అందించటం లేదు. ఏపీలో ప్రధానంగా రెండు పార్టీల మధ్య అధికారం మార్పిడి జరగనుంది. అయితే తెలుగుదేశం లేకపోతే వైసిపి ప్రజలు మూడో ప్రత్యామ్నాయంగా వెళ్లాలనుకుంటే జనసేన ఉంది. బిజెపికి ఎంత మాత్రం సీన్ లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు 2019 ఎన్నికల్లోనే తేల్చేశారు. ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కనీసం ఒక్క అసెంబ్లీ సీటు ఒక్క లోకసభ సీటు గెలవటం కాదు కదా.. ఒక్కచోట కూడా డిపాజిట్ దక్కలేదు.
బిజెపి నుంచి పోటీ చేసిన ఎవరికి పదివేల ఓట్లు కూడా రాలేదు. గత ఎన్నికల తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లి బిజెపితో చేతులు కలిపారు. జనసేన – బిజెపి మిత్ర పక్షాలు అయిపోయాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇప్పటివరకు ఉన్న అనుమానాలకు పవన్ కళ్యాణ్ తెరదించేశారు. తాను బిజెపితో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో చెప్పకనే చెప్పేశారు.
జనసేన భవిష్యత్తు కోసం తను భవిష్యత్తులో ఎవరితో కలిసి ప్రయాణం చేస్తారో క్లారిటీ ఇచ్చేశారు. బిజెపితో పొత్తు పెట్టుకుని తాము అనుకున్న ప్లాన్ పక్కాగా అమలు చేసి ఉంటే టిడిపితో అవసరం లేకుండానే ఎదిగే వాళ్ళం అని.. కానీ అది సాధ్యం కాలేదని పవన్ తేల్చిచెప్పారు. పవన్ కళ్యాణ్ అమరావతి ఏకైక రాజధాని అంటే ఢిల్లీ నేతలు ఒప్పుకున్నారని…. కానీ స్థానిక బిజెపి నేతలు అలాంటిదేమీ లేదని అంటున్నారని చెప్పారు. కలిసి పోరాటం చేయడానికి బిజెపి వాళ్లు రాకపోతే నేనేం చేయను అంటూ పవన్ ప్రశ్నించారు.
అమ్మ పెట్టదు అడుకొనివదు అన్నట్టుగా బిజెపి వ్యవహరిస్తుందని కూడా పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే సీట్ల విషయంలో తాను ఎక్కడ కాంప్రమైజ్ కాను అంటూనే.. టిడిపి తో కలిసి వెళ్లే విషయాన్ని చెప్పడంతో పాటు ఆ పార్టీపై కాస్త ఒత్తిడి పెంచేందుకే ఇలా మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది.తనకు టిడిపి అంటే ప్రత్యేకమైన ప్రేమ లేదని చెబుతునే.. చంద్రబాబు సమర్థులనే గౌరవం మాత్రం ఉందని చెప్పుకొచ్చారు.
ఇక తనతో సహా పోటీ చేసిన అభ్యర్థులంతా గెలిచేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు కూడా పవన్ చెప్పారు. పవన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే బిజెపి నాయకులకు దిమ్మతిరిగిపోయినట్టు అయింది. వచ్చే ఎన్నికల్లోను ఏపీలో బిజెపి ఒక్క సీటు కూడా గెలవడం కాదు కదా.. ఒక్క సీట్లో కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి దరిద్రమైన రికార్డును వరుసగా రెండుసార్లు తన ఖాతాలో వేసుకున్న డిజాస్టర్ రికార్డు బిజెపికి దక్కనుంది.