ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు అధికార పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఎమ్మెల్యేల కోటాలో మొత్తం ఆరు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే విజయం సాధించేందుకు 23 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. అయితే టిడిపి నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరు ఎమ్మెల్యేలుగా మారి అధికార వైసీపీకి సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టిడిపి నుంచి ఏకంగా బీసీ మహిళా కోటాలో విజయవాడకు చెందిన పంచుమర్తి అనురాధను చంద్రబాబు పోటీలో పెట్టారు. దీంతో ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.
అయితే వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఇద్దరు బయటకు వచ్చేశారు. ఇప్పుడు వీరిద్దరు కూడా తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేయటం పక్కా. దీంతో వైసిపి శిబిరంలో కూడా టెన్షన్ మొదలైంది. మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళల్లో ఒకరిద్దరూ క్రాస్ ఓటింగ్ చేసిన వైసీపీ నుంచి నిలబెట్టిన అభ్యర్థుల్లో ఒకరు ఓడిపోయే ఛాన్స్ ఉంది.
దీంతో ఇప్పుడు వైసీపీలో అసమ్మతితో ఉన్న ఎమ్మెల్యేలపై జగన్ చాలా గట్టిగా నిఘాపెట్టినట్టు తెలుస్తోంది.అందుకే ఒక్కోమంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునే బాధ్యతలను అప్పగించారు జగన్. ప్రకాశం జిల్లా కు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పై వైసీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
వీరిద్దరూ క్రాస్ ఓటింగ్కు పాల్పడతారా ? అన్న డౌట్ అయితే పార్టీ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
అదే జరిగి వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోతే అంతకు మించిన పరాభవం ఉండదు. దీంతో ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేల విషయంలో గట్టిగా నిగా పెట్టించినట్టు తెలుస్తోంది.