టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఇప్పటికే లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇటు చంద్రబాబు కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఏదెలా ఉన్నా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయనకు పట్టు దొరకడం లేదు. అసలు గత 20 సంవత్సరాలలో ఇక్కడ టీడీపీ గెలవని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.
చంద్రగిరిలో చివరిసారిగా టీడీపీ 1994లో మాత్రమే గెలిచింది. అది చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. జిల్లా మొత్తం మీద ఒక్క కుప్పంలో మాత్రమే టీడీపీ వరుస విజయాలు నమోదు చేస్తూ వస్తోంది. జిల్లాలో ఆరు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత మూడు ఎన్నికల్లోనూ టీడీపీ వరుసగా ఓడిపోతూ వస్తోంది. గంగాధర నెల్లూరు(ఎస్సీ) – పూతలపట్టు(ఎస్సీ) – చంద్రగిరి – పీలేరు – మదనపల్లి – పుంగనూరు స్థానాల్లో టీడీపీ గత మూడు ఎన్నికల నుంచి విజయం సాధించలేదు.
అయితే ఈ సారి అక్కడ పరిస్థితులు చాలా శరవేగంగా మారుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు నగరి, తిరుపతి, చిత్తూరు, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లి, పూతలపట్టు లాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఈ సారి ఈ 8 నియోజకవర్గాల్లో టీడీపీ గ్యారెంటీగా గెలుస్తుందని ఇప్పటికే అంచనాలు మొదలైపోయాయి.
ఈ సారి జిల్లాలోని 14 సీట్లలో 8 సీట్లలో టీడీపీ గ్యారెంటీగా గెలుస్తుందని.. ఎన్నికల టైంకు మరో 2-3 సీట్లలో గెలిచి వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదంటున్నారు. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన తిరుగులేని పట్టు సాధించారని.. ఇన్నాళ్లకు ఇక్కడ సైకిల్ జెట్ స్పీడ్తో వెళుతోందనే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.