ఏపీలో వచ్చే ఎన్నికలలో అధికారం దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇప్పటికే యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి వెళుతున్నారు. గతంలో చంద్రబాబు నామినేషన్లు వేసే చివరి రోజు వరకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయకుండా ప్రచారం చేస్తూ వచ్చేవారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ దెబ్బతింది. అయితే ఈసారి అందుకు బిన్నంగానే చంద్రబాబు వరుసగా సమీక్షలు చేస్తూ చాలా నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులను ముందే ఖరారు చేస్తూ వస్తున్నారు.
యువగళం పాదయాత్రలో లోకేష్ కూడా కొన్ని నియోజకవర్గాలలో ఎవరు ? పోటీ చేస్తారో ఓపెన్ గానే క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికలలో టీడిపి నుంచి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చాలా చోట్ల క్లారిటీ వచ్చేసింది. విశాఖ నుంచి బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ – విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు లాంటి నేతలు ఉన్నారు. అయితే అనకాపల్లి, పాడేరు, అరకు, కాకినాడ, రాజమండ్రి నియోజకవర్గాలకు పార్టీ తరపున అభ్యర్థులు లేరు.
నరసాపురం నుంచి వైసీపీ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు టీడీపీలోకి వస్తే ఆయనకే సీటు ఇస్తారని అంటున్నారు. ఏలూరు నుంచి మాగంటి బాబు, మచిలీపట్నం నుంచి కొనకళ్ళ నారాయణ ఉన్నారు. అయితే బాపట్ల, ఒంగోలు, నెల్లూరు నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. కడప నుంచి శ్రీనివాసరెడ్డి, హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప, అనంతపురం నుంచి జెసి పవన్, రాజంపేట నుంచి గంటా నరహరి రేసులో ఉన్నారు.
అలాగే నంద్యాల నుంచి శివానందరెడ్డి.. కర్నూలు నుంచి కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాలకు కూడా ఎంపీ అభ్యర్థులు లేరు. తిరుపతికి పనబాక లక్ష్మీ ఉన్న వయసు రీత్యా ఈసారి ఆమె పోటీ చేయకపోవచ్చు. ఇక సిట్టింగ్ ఎంపీల విషయానికి వస్తే శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని ఉన్నారు. సమీకరణలు మారకపోతే తిరిగి ఆ స్థానాల్లో వారే మరోసారి పోటీ చేయవచ్చు. ఇక నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ తనయుడు పుట్టా మహేష్ సీటు ఆశిస్తున్నారు. ఇతను యనమల రామకృష్ణుడుకు అల్లుడు కూడా కావడంతో దాదాపుగా టికెట్ ఖాయమనే ప్రచారం నడుస్తోంది. అలాగే ఎంపీ స్థానాలకు సామాజికంగా ఆర్థిక అంగబాలాలు ఉన్న నేతలు దొరకకపోతే సీనియర్ నేతల వారసులే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అనకాపల్లి నుంచి అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.