ఏపీలో పట్టభద్రుల నియోజకవర్గం జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీకి అదిరిపోయే షాక్ లు తగిలాయి. ఇప్పటికే తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉత్తరాంధ్ర నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో ఘనవిజయం సాధించారు. ఇక పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలోనూ టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధిక్యతతో కొనసాగుతున్నారు.
ముఖ్యంగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో నుంచి గెలిచిన యువకుడు కంచర్ల శ్రీకాంత్ గురించి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. తూర్పు రాయలసీమ అంటేనే వైసీపీకి ఎంత కంచుకోట చెప్పక్కర్లేదు. ఇందులో చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఈ మూడు జిల్లాలు గత పది ఏళ్లకు పైగా వైసిపి డామినేషన్తో దూసుకుపోతున్నాయి. అసలు గత ఎన్నికలలో అయితే చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి చంద్రబాబు మాత్రమే గెలిచారు.
నెల్లూరు జిల్లాలో అయితే టిడిపికి ఒక్క సీటు కూడా రాలేదు. కాస్తో కూస్తో ప్రకాశం జిల్లాలో 4 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. పార్టీ ఈ ప్రాంతంలో పార్టీ అంత గడ్డు పరిస్థితిలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో కంచర్ల శ్రీకాంత్ తానున్నానంటూ పోటీకి బరిలోకి దిగాడు. పార్టీ యువనేత నారా లోకేష్, అధినేత చంద్రబాబు ఆశీస్సులు తీసుకుని గత నాలుగైదు నెలలుగా మూడు జిల్లాలలో 36 నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించారు. కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్యకు ఎన్టీఆర్ 1994 లోనే కందుకూరు టిడిపి టికెట్ ఆఫర్ చేశారు.
ఇప్పుడు ఆయన తనయుడు శ్రీకాంత్ ఏకంగా మూడు జిల్లాల శాసనమండలి సభ్యుడుగా ఆరు జిల్లాలలో ప్రోటోకాల్ పొందటం విశేషం. జర్నలిజం వదిలిపెట్టి కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి తండ్రి ఆశయం నెరవేర్చటంలో శ్రీకాంత్ ఎంతో పట్టుదలతో శ్రమించారు. కందుకూరు జడ్పిటిసి సభ్యుడిగా ప్రజాక్షేత్రంలో తానేంటో నిరూపించుకున్న శ్రీకాంత్.. అధికార వైసిపి హవా కొనసాగుతున్న క్రమంలో నారా లోకేష్ ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటింప చేసుకున్నారు.
అసలు మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం నలుగురు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. అటువైపు వైసీపీ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇలా ఎంతోమంది మోహరించారు. అటు అధికారం అండ ఇవన్నీ ఉన్నా కూడా శ్రీకాంత్ పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించారు. మూడు జిల్లాల టిడిపి నేతలను సమన్వయం చేసుకుంటూ శ్రీకాంత్ పడిన కష్టానికి పట్టభద్రులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటేసి ఎమ్మెల్సీని చేశారు.ఏకంగా 35 వేల ఓట్ల భారీ మెజార్టీతో శ్రీకాంత్ సాధించిన ఈ ఘనవిజయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణుల్లో సరికొత్త ఉత్తేజం నింపింది.