వచ్చే 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని అంతర్గతంగా చెబుతున్న టీడీపీకి ఇప్పుడు కీలకమైన అవరోధాలు కనిపిస్తున్నాయా ? జనసేనతో పొత్తు అంత తేలికకాదా? పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. చంద్రబాబు కంటిపై కునుకు లేకుండా పోతుందా ? వైసీపీని ఓడించామనే సంతృప్తి తప్ప.. మిగిలిన ఐదేళ్లు కూడా.. బాబు సర్కారుకు ఇబ్బందులు తప్పవా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
కీలకమైన ముఖ్యమంత్రి పీఠంపై జనసేన కూడా ఆశలు పెట్టుకున్నట్టు తాజా పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. అదేసమయంలో చంద్రబాబు ప్రాధాన్యాలు వేరేగా ఉండగా.. జనసేన ప్రాధాన్యాలు కూడా వేరేగా ఉన్నాయి. ఇక, ముఖ్యమంత్రి పవనే అంటూ.. జనసేన వర్గాలు బలంగా చెబుతున్నాయి. కానీ, తాను చేసిన శపథం నెరవేర్చుకునేందుకు… తన హయాంలో ఏపీని అభివృద్ధి చేయాలని.. అమరావతిని నిర్మించాలని బాబు భావిస్తున్నారు.
ఈ రెండు విషయాలు కూడా పొత్తులపై ప్రభావం చూపిస్తున్నాయనేది విశ్లేషకుల మాట. పొత్తులు పెట్టుకు ని అధికారంలోకి వచ్చినా.. సీఎం సీటు విషయంలో పెద్ద రగడ చోటు చేసుకునే అవకాశం అయినా.. ఉం టుందని.. లేకపోతే.. ప్రభుత్వం ఏర్పడినా.. జనసేన కోరికలను మన్నించాల్సి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పైకి పొత్తులు బాగానే ఉన్నాయని అనుకున్నా.. పదవులు.. పీఠాల విషయానికి వచ్చే సరికి.. జనసేనను సంతృప్తి పరచడం అంత ఈజీ కాదని అంచనాలు వస్తున్నాయి.
జనసేనకు కనీసం నాలుగు మంత్రి పదవులు అయినా.. ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఉన్న అంచనాల ప్రకారం.. సీఎం సీటుపై నాగబాబు వంటివారు తరచుగా కామెంట్లు చేస్తున్నారు. పవనే సీఎం అవుతారని చెబుతున్నారు. మరి ఇది ఎలా సాధ్యమో ఆయన చెప్పడం లేదు. పైగా.. మంత్రి పీఠాల విషయానికి వస్తే.. గతంలోబీజేపీకి ఇచ్చినట్టు ఏదో నాలుగు పదవులు ఇచ్చి చేతులు దులుపుకొంటామంటే కూడా కుదిరేలా కనిపించడం లేదు.
ప్రభుత్వ నిర్ణయాల్లో జనసేనకు ప్రాధాన్యం కల్పించాల్సి ఉంటుంది. ఇది.. టీడీపీకి రుచించేలా కనిపించడం లేదు. దీంతో పొత్తులు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. బాబుకు కంటిపై కునుకు ఉండేలా కనిపించడం లేదని… అందుకే ఇప్పుడు టీడీపీ నేతల నుంచి పొత్తు వద్దన్న డిమాండ్లు చంద్రబాబు దగ్గర ఎక్కువుగా వస్తున్నాయి అంటున్నారు పరిశీలకులు.