వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఎలాంటి డౌట్ కనిపించడం లేదు. అయితే రెండు పార్టీలు కలిస్తేనే వైసీపీకి చెక్ పడుతుందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. కానీ ఈ సారి అలా జరగకూడదని రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి.
అయితే ఇప్పటికే చాలామంది టిడిపి నేతలు..పవన్ సపోర్ట్ ఉంటేనే గెలుపు సాధ్యమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపి సీనియర్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ..పవన్ తో పొత్తు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. అసలు అందరికంటే మొదట పితానినే జనసేనతో పొత్తు ఉంటే బాగుంటుందని అన్నారు. పవన్ కలిస్తే విజయం ఇంకా సులువు అవుతుందని భావిస్తున్నారు.
ఈ మధ్య కూడా పితాని..పవన్ని టిడిపి వైపుకు రానివ్వకుండా బిజేపి అడ్డుకుంటుందని ఫైర్ అయ్యారు.
మొత్తానికి పవన్ సపోర్ట్ ఉంటే గెలుపు సులువు అనేది పితాని ఆలోచన. టిడిపి-జనసేన కలిస్తే చాలా స్థానాల్లో ఫలితాలు తారుమారు అవుతాయి. ఈ క్రమంలో పితాని సొంత స్థానం ఆచంటలో కూడా సీన్ మారుతుంది. 2014లో జనసేన సపోర్ట్ ఉండటం వల్లే పితాని గెలిచారు.
కానీ 2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి పితాని ఓడిపోయారు. అక్కడ వైసీపీ గెలిచింది. గత ఎన్నికల్లో వైసీపీ సుమారు 12 వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే..అక్కడ జనసేనకు 13 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే టిడిపి-జనసేన కలిస్తే ఆచంటలో వైసీపీ గెలిచేది కాదు. ఇప్పుడు పొత్తు ఉంటే ఆచంటలో తన గెలుపు ఖాయమని పితాని భావిస్తున్నారు. చూడాలి మరి ఆచంటలో ఈ సారి ఎలాంటి ఫలితం వస్తుందో.