రాజంపేట ఎంపీ సీటు టీడీపీకి అందని ద్రాక్ష..ఈ సీటులో టిడిపికి గెలుపు అనేది చాలా అరుదు..అక్కడ టిడిపి గెలిచింది కేవలం రెండుసార్లు మాత్రమే. 1984లో ఒకసారి..మళ్ళీ 1999 ఎన్నికల్లో రాజంపేటలో టిడిపి విజయం సాధించింది. అంతే ఇంకా ఎప్పుడు అక్కడ టిడిపి గెలవలేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా గెలిచింది. అటు 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది.
వైసీపీ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరుసగా గెలుస్తున్నారు..ఈ సారి ఎన్నికల్లో కూడా మిథున్ రెడ్డి పోటీకి రెడీ అవుతున్నారు. అలాగే ఖచ్చితంగా గెలవాలనే దిశగా మిథున్ రెడ్డి వెళుతున్నారు. అయితే ఈ సారి మిథున్ రెడ్డికి చెక్ పెట్టాలని టిడిపి చూస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త గంట నరహరిని రాజంపేట బరిలో దింపడానికి సిద్ధమయ్యారు. అయితే నరహరి టిడిపిలో చేరినప్పుడు బాగా దూకుడుగా పనిచేశారు గాని..ఇటీవల కాలంలో అంత దూకుడుగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు.
దీంతో రాజంపేటలో ఇప్పటికీ వైసీపీ హవానే ఉంది. అక్కడ మిథున్ రెడ్డి బలంగా ఉన్నారు. గత ఎన్నికల్లో మిథున్ రెడ్డి..దాదాపు 2 లక్షల 68 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఈ సారి మెజారిటీ కాస్త తగ్గవచ్చు గాని..గెలుపు మాత్రం మిథున్ రెడ్డిదే అని తెలుస్తోంది. ఎందుకంటే రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకే పట్టు ఎక్కువ కనిపిస్తుంది.
పార్లమెంట్ పరిధిలో రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, పీలేరు, మదనపల్లె, పుంగనూరు, తంబళ్ళపల్లె నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో పుంగనూరు, రాయచోటి, తంబళ్ళపల్లె స్థానాల్లో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇటు రాజంపేట, పీలేరు స్థానాల్లో కాస్త టిడిపికి పట్టు కనిపిస్తుంది. రైల్వేకోడూరు, మదనపల్లె స్థానాల్లో పోటాపోటి ఉంది…కానీ వైసీపీకే కాస్త ఎడ్జ్ ఉంది..దీని బట్టి చూస్తే రాజంపేట పార్లమెంట్ లో మళ్ళీ వైసీపీ గెలుపు ఖాయమే.