ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసమని మూడు రాజధానులని అమలు చేయాలని నిర్ణయం తీసుకుని, ఆ మేరకు ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. అయితే మూడు రాజధానులు వద్దు అని అమరావతినే రాజధానిగా ఉండాలని, టీడీపీతో సహ పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే మూడు రాజధానులపై కేంద్రం తన నిర్ణయాన్ని లోక్ సభలో చెప్పకనే చెప్పింది.
లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మూడు రాజధానులపై ప్రశ్న అడుగగా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాజధానిపై రాష్ట్రాలదే తుది నిర్ణయమని, ఇందులో కేంద్రం కలగజేసుకోలేదని స్పష్టం చేశారు. అయితే 2015 ఏప్రిల్ 4నలో ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని, కానీ ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా రిపోర్టుల్లో చూశామని, కాకపోతే రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక కేంద్రం కూడా లోక్ సభ వేదికగా తన నిర్ణయం చెప్పడంతో, జగన్ ప్రభుత్వం మూడు రాజధానులపై దూకుడుగా వెళ్ళే అవకాశముంది. అదే సమయంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీకి కేంద్ర నిర్ణయం ఓ షాక్ అనే చెప్పాలి.