ఇటీవలే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ను అందుకున్నాడు ప్రిన్స్ మహేష్బాబు. బాక్సాఫిస్ వద్ద సుమారు రూ. 120 కోట్ల గ్రాస్ను షేర్ చేశాడని టాలివుడ్ ట్రేడ్ వర్గాల అంచనా. ఆ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ప్రస్తుతం మన హీరో. అందుకోసమే కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఆనందంగా గడుపుతున్నాడు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలకు ముందే మహేష్ తన తరువాతి చిత్రాన్ని ప్రకటించాడు. మహర్షీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లీతో చిత్రం తీయనున్నట్లు వెల్లడించారు. మహేష్ తిరిగి వచ్చిన తరువాత వేసవిలో ఆ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది.
ఇదిలా ఉండగా ఆ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ను కూడా ఎంపిక చేశారని తెలిసింది. భరత్ అను నేను సినిమాలో మహేష్కు జోడిగా నటించిన కియారా అద్వానీనే ఈ చిత్రానికీ ఓకే చేసినట్లు సమాచారం. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీలైన్ బయటకు వచ్చేసింది. దర్శకుడు వంశీ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. మహేష్బాబు స్టార్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని కథను సిద్ధం చేస్తున్నాడు. సినిమాలో మహేష్ పర్యావరణాన్ని సంరక్షించే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అదీగాక చిత్రంలో ప్రిన్స్ ప్రదర్శించే మేనరిజం, స్టైల్ను కొత్తగా చూపించనున్నారని తెలిసింది. మహేష్ గతంలో గ్యాంగ్స్టర్గా పోకిరి, బిజినెస్మెన్ చిత్రాల్లో కనిపించి మురిపించారు. పోకిరీ ఆల్టైం రికార్డును నెలకొల్పగా, బిజినెస్మాన్ బోల్తా కొట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందోనని అప్పుడే ఊహాగానాలు చేస్తున్నారు ప్రేక్షకులు.