కృష్ణాజిల్లా గన్నవరంలో 2024 ఎన్నికలలో ఎవరు విజయం ? సాధిస్తారు అన్నది ఇప్పుడు ఏపీలో మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాలలోనే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అలాంటి తీవ్రమైన వ్యతిరేక గాలిలోనూ దాటి వల్లభనేని వంశీ వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లోనూ వంశీ గన్నవరం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన సంగతి తెలిసిందే.
పార్టీ ఓడిపోయిన ఏడాది నుంచి వంశీ అసమ్మతి స్వరం వినిపిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత వైసీపీకి దగ్గరైన వంశీ చంద్రబాబుతో పాటు లోకేష్ ను తీవ్రస్థాయిలో దూషించారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరీని సైతం వ్యక్తిగతంగా కామెంట్ చేయడంతో.. చంద్రబాబు సైతం తీవ్ర ఆవేదన చెందారు. వంశీ పార్టీ మారాక మచిలీపట్నం కు చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గన్నవరం ఇన్చార్జి పగ్గాలు ఇచ్చారు. అర్జునుడు పార్టీ పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఇటీవల ఆయన మృతి చెందారు.
దీంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి అక్కడ కొత్త అభ్యర్థిని నిలబెట్టాలి. గన్నవరంలో వంశీ ఓడిపోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు కూడా కసితో రగిలిపోతున్నాయి. వంశీ అంటే టిడిపి శ్రేణుల్లో అంత తీవ్రంగా వ్యతిరేకత వచ్చేసింది. గన్నవరంలో వంశీ బలమైన అభ్యర్థి.. మరి వంశీ పై అంతే బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపితే తప్ప తెలుగుదేశం విజయం సాధించే అవకాశాలు ఉండవు. ఇందుకోసం చంద్రబాబు ఓ సరికొత్త వ్యూహం రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది.
గన్నవరం నియోజకవర్గానికి చెందిన మహిళ కాంగ్రెస్ నాయకురాలికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆమెకు టిడిపి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. సుంకర పద్మశ్రీ గత 15 సంవత్సరాలుగా గన్నవరంలో యాక్టివ్గా రాజకీయాలు చేస్తున్నారు. 2009 ఎన్నికల్లోనే ఆమె కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. సామాజిక ఆర్థిక అంగ బలాలు కూడా ఉన్నాయి. మంచి ఫేస్ చరిష్మా కూడా ఉంది.
అంతేకాకుండా బలమైన వాగ్దాటి ఉన్న మహిళా నాయకురాలు కూడా. వంశీ పై కూడా గతంలో ఢీ అంటే ఢీ కొన్నారు. వంశీ పార్టీ మారినప్పటి నుంచే సుంకర పద్మశ్రీ టిడిపిలోకి వస్తారని ఒక్కటే వార్తలు జోరుగా వైరల్ అయ్యాయి. మధ్యలో అర్జునుడు వచ్చారు. ఇప్పుడు ఆయన లేకపోవడంతో మహిళ కోటతో పాటు అన్ని ఈక్వేషన్లలో ఆమె బలమైన అభ్యర్థి అవుతారని చంద్రబాబు భావించి ఆమెకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె కూడా పార్టీలో చేరాలంటే కొన్ని కండిషన్లు పెట్టారని.. అందుకు చంద్రబాబుకు కూడా సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. పద్మశ్రీ గన్నవరంలో టిడిపి అభ్యర్థిగా రంగంలో ఉంటే హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.