ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ పార్టీ కేంద్రంలో భాగస్వామ్యం కానుందని, ఆయా అంశాలపై చర్చించడానికే జగన్ హస్తినకు పయనమయ్యారని ఊహాగానాలు బయలు దేరాయి. అదీగాక పలువురు వైసీపీ నేతలు కూడా అందుకు అవకాశముందని, కలిస్తే తప్పేంటని వ్యాఖ్యానించి అందుకు సంకేతాలు ఇచ్చారు. దీంతో బీజేపీ, వైసీపీ ఇరు పార్టీల నడుమ పోత్తు ఖరారైందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్నది. తాజాగా ఈ అంశంపై బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్చార్జి సునీల్ దియోదర్ స్పష్టత నిచ్చారు. పొత్తపై క్లారిటీగా సమాధానం చెప్పారు.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. రాజధాని విషయంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని, అందులో టీడీపీ, వైసీపీ మైండ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు. కౌన్సిల్ రద్దు అనేది ఏకపక్ష నిర్ణయమని ఆరోపించారు. ఒక్క రాష్ట్రం ఒక్క రాజధానే బీజేపీ నినాదమని స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్, ప్రధాని మోదీని కలవడంపై వస్తున్న వార్తలపై స్పందించిన సునీల్ దియోదర్ అందుకు ఎంత మాత్రం అవకాశం లేదని కుండబద్దలు కొట్టారు. తాము ఏపీలో జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే స్థానిక ఎన్నికలో కూడా కలిసి పని చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని వివరించారు. రాష్ట్ర సీఎంలు, ప్రధానిని కలువడం సహజమేనని, వాటిని అపార్థం చేసుకోవద్దని దియోదర్ హితవుపలికారు.