ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టిడిపి వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఎక్కడకక్కడ పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో పట్టు సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం శింగనమల నియోజకవర్గంలో వైసీపీకి చెక్ పెట్టడమే టార్గెట్ గా టిడిపి పావులు కదుపుతుంది.
గత ఎన్నికల్లో ఇక్కడ 40 వేల ఓట్ల పైనే మెజారిటీతో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా అక్కడ ఆమె చేసే అభివృద్ధి పెద్దగా లేదు. పైగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అక్రమాలు ఎక్కువ ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలు వైసీపీకి మైనస్ అవుతున్నాయి. కానీ ఇంకా ఇక్కడ టిడిపి బలపడాలి. ఇక్కడ టిడిపి ఇంచార్జ్ గా బండారు శ్రావణి పనిచేస్తున్నారు.
ఆమెకు కొందరు టిడిపి సీనియర్లు సహకరించడం లేదు. కేవలం జేసి ఫ్యామిలీ మద్ధతు మాత్రం ఉంది. దీంతో శింగనమలలో అనుకున్న విధంగా పార్టీ బలపడలేదు. ఈ క్రమంలోనే తాజాగా జేసి దివాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ తో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన్ని టిడిపిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. గతంలోనే శైలజానాథ్ టిడిపిలోకి రావాలని చూశారు గాని..ఎందుకో అప్పుడు కుదరలేదు. ఇప్పుడు శైలజానాథ్ టిడిపిలో చేరడం ఖాయమని తెలుస్తోంది.
ఇక 2004, 2009 ఎన్నికల్లో శైలజానాథ్ కాంగ్రెస్ నుంచి శింగనమలలోనే గెలిచారు. దీంతో అక్కడ ఆయనకు కాస్త పట్టు ఉంది. అయితే టిడిపిలోకి వస్తే శింగనమల సీటు ఇస్తారా ? అనే డౌట్ ఉంది. శైలజానాథ్కు సీటు ఇవ్వాలంటే శ్రావణిని సైడ్ చేయాలి. అయితే శ్రావణి కూడా జేసి ఫ్యామిలీ మనిషే..మరి అలాంటప్పుడు శింగనమల సీటు విషయంలో ఎలాంటి ? నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.