ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తుంది. ఇప్పటికే స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, డిగ్రీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసాయి. త్వరలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు. అయితే చంద్రబాబు బీసీ మహిళ నాయకురాలు పంచుమర్తి అనురాధతో నామినేషన్ వేయించారు.
శాసనసభలో తమ పార్టీకి ఉండే ఎమ్మెల్యేల బలం సరిపోదని తెలిసిన కూడా చంద్రబాబు అదిరిపోయే స్కెచ్ తో వైసీపీని ఇరుకున పెట్టనున్నారు. నిజానికి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించాలంటే ఒక్కో ఎమ్మెల్సీకి 23 ఓట్లు అవసరం అవుతాయి. 2019లో తెలుగుదేశం తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో నలుగురు ఇప్పటికే వైసీపీకి దగ్గరయ్యారు.
వీరు ఎలాగూ టీడీపీకి ఓటు వేయరు. ఒకవేళ వీరికి వీప్ జారీ చేసినా వీరు తమ ఓట్లు చెల్లుబాటు కాకుండా ఉండేలా చేసే అవకాశం ఉంది. లేదా తెగించి వైసీపీకే ఓట్లు వేయవచ్చు. జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ ఓటు కూడా వైసీపీకే పడనుంది. అయితే ఈ ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటు వేస్తారా లేదా తమ ఓటు చల్లకుండా చేసుకుంటారా అన్నది తెలియదు. ప్రస్తుతానికి టిడిపికి 19 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
వైసీపీలో రెబెల్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు టిడిపి అభ్యర్థికి ఓటు వేస్తారని అంటున్నారు. అలా చేసిన మరో రెండు సీట్లు టిడిపి ఎమ్మెల్సీ కి కావాలి. ఇక వైసీపీలో చెప్పుకోకపోయినా మరి కొందరు అసంతృప్తితో ఉన్నారు. ఒకటి, రెండు ఓట్లు క్రాస్ అయినా టిడిపి కచ్చితంగా ఎమ్మెల్సీ తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలనం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.