వై నాట్ 175 అంటూ ఒక్కటే నినాదంతో ప్రతిపక్షాలకు సవాల్ విసురుతోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అందరూ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఉండడంతో అక్కడ వైసిపి వారు వన్ సైడ్ చేసేసింది. ఇక ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచింది. ఇక యువతలో.. నిరుద్యోగుల్లోనూ తమకు ఎదురులేదని నిరూపించుకునేందుకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అన్నిచోట్ల బలమైన అభ్యర్థులను పోటీలో పెట్టింది. ఇంకా చెప్పాలంటే పట్టభద్రుల నియోజకవర్గాల్లో మూడు చోట్ల జగన్ తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే రంగంలోకి దింపారు. ఎక్కడా ఖర్చుకు వెనుకాడ లేదు. చివరకు డబ్బు పంపిణీలోను.. అధికార పార్టీ వెనక్కు తగ్గలేదని మంత్రి ఉషశ్రీ చరణ్ లీకైన వీడియోలు బయటపెట్టాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పట్టభద్రులు కాకపోయినా ఏడో తరగతి… పదో తరగతి చదివిన వారిని కూడా అధికార పార్టీ నేతలు ఓటర్లుగా నమోదు చేయించారని తిరుపతిలో పోలింగ్ రోజు బయటపడిన సంఘటనలు శాఖాలుగా నిలిచాయి.
ఎన్ని చేసినా అటు ఉత్తరాంధ్రతో పాటు… ఇటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అప్రతిహత ఘనవిజయాలు నమోదు చేసింది. ఇక పశ్చిమ రాయలసీమలోనూ హోరాహోరీ పోరులో టిడిపి గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతిపక్ష పార్టీలు.. అటు అధికార పార్టీ ఈ ఎన్నికలను సెమీఫైనల్స్ గా తీసుకున్నాయి. ఇక జగన్ సైతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తేడా వస్తే మంత్రులకు పదవులు పోతాయింటూ చాలాసార్లు వార్నింగ్ లు కూడా ఇచ్చారు.
అయితే ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో వైసిపి ఘోరంగా ఓడిపోయింది. ఈ ఎఫెక్ట్ ఏఏ ? మంత్రులపై ఉంటుందన్న ఆందోళనలు వైసిపి వర్గాల్లో కనిపిస్తున్నాయి. తూర్పు రాయలసీమలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఘనవిజయం సాధించారు. ఇందులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా చిత్తూరు కూడా ఉంది.శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో పెద్దిరెడ్డి కాస్త ముభావంగానే కనిపించారని మీడియా మిత్రులు చెబుతున్నారు. అలాగే వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా కూడా చిత్తూరు జిల్లా నుంచే ప్రాథినిత్యం వహిస్తున్నారు.
నెల్లూరు జిల్లా నుంచి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి – ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. ఈ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో టిడిపికి ఎంత భారీ మెజార్టీ రావడంతో వాళ్లకు పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.ఇక ఉత్తరాంధ్రలో విజయ్ సాయి రెడ్డి, సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ లాంటి మహామహులు అయిన టాప్ లీడర్లు మంత్రులుగా ఉన్నా కూడా వైసిపి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు జగన్ ఈ మంత్రులలో ఎవరికి షాకులు ఇస్తారు ఎవరి పదవులు ఊస్టింగ్ అవుతాయి అన్నది వైసీపీలో కాస్త టెన్షన్ టెన్షన్ గానే ఉంది.