రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అధికార వైసిపికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోనే వైసిపి చావుతప్పి కన్నులొట్ట పోయిన చందంగా గెలిచింది. అయితే 13 ఉమ్మడి జిల్లాలలో ఇప్పుడు తొమ్మడి ఉమ్మడి జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి. ఇందులో కీలకమైన ఉత్తరాంధ్ర జిల్లాలు.. అంతకన్నా ఎంతో ముఖ్యమైన రాయలసీమ నాలుగు జిల్లాల తో పాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కలిసి ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో 108 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రులు ఓటు వేశారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 2,90,000 ఓట్లు ఉండగా రెండు లక్షల పదమూడు వేల మంది ఓటేశారు. ఇక తూర్పు రాయలసీమలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 3.81 లక్షల ఓట్లు ఉండగా 2.70 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇక కడప, అనంతపురం, కర్నూలు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 3.33 లక్షల ఓటర్లు ఉండగా 2.45 లక్షల మంది ఓటు వేశారు. అంటే 9 జిల్లాలలో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7.16 లక్షల మంది ఓటర్ల అభిప్రాయం వెలుగులోకి వచ్చింది.
దీంతో ఈ ఫలితాలకు విస్తృతమైన ప్రాధాన్యం ఉంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో వైసిపి కన్నా టిడిపి ఏకంగా 10 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకొని ఘనవిజయం సాధించింది. ఉత్తరాంధ్రలో ఈ తేడా ఏకంగా 14 శాతంగా ఉంది. అసలు ఎన్ని సంస్థలు.. ఎన్ని సర్వేలు చేసినా ఇంతకుమించి ప్రజాభిప్రాయం రాదని.. దీనిని వాస్తవమైన ప్రజాభిప్రాయ సేకరణగా తీసుకోవాలని.. ఏ సర్వే సంస్థ కూడా ఇంతకంటే ఎక్కువ శాంపిల్స్ తీసుకుని సర్వే చేయదని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంటే 108 నియోజకవర్గాల్లో 7.16 లక్షల ఓటర్ల అభిప్రాయం ఇంత బలంగా స్పష్టమైనప్పుడు ఇంతకుమించి ఏం సర్వేలు ? కావాలని అధికార పార్టీపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ? చెప్పేందుకు ఇదే నిదర్శనం అని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. వైసిపి కంచుకోటలు.. నమ్ముకున్న జిల్లాలలోనే ఫ్యాన్ పార్టీ చతికిల పడింది. ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ? ఈ ఎన్నికలు నిదర్శనంగా నిలిచాయి. వైసీపీకి ఎంతోమంది హేమాహేమీలు సాయంతో పాటు వలంటీర్ల వ్యవస్థ.. సచివాలయ వ్యవస్థను కూడా వాడుకున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేశారు.
అంటే 108 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏకంగా 10 శాతం తేడాతో ప్రజాభిప్రాయ సేకరణ కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లోను ఆ పార్టీ తక్కువలో తక్కువగా 100కు పైగా స్థానాల్లో సులువుగానే విజయం సాధిస్తుందని.. ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ఫలితాలే వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.