ఇద్దరు యంగ్ స్టార్లు. ఒకరు జూనియర్ ఎన్టీఆర్. మరొకరు మెగాస్టార్ తనయుడు రామ్చరణ్. మరోవైపు ఈగ, బాహుబలి తదితర చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చిన దర్శక దిగ్గజం రాజమౌళి. ముగ్గురి కలయికలో వస్తున్న చిత్రమే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మొదటి నుంచి సంచలనాలకు కేంద్రబిందువుగా నిలుస్తున్నది. రోజురోజుకూ అంచనాలను పెంచుకుంటున్నది. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవితాల నేపథ్యంలో తెరకెక్కె సోషల్ ఫిక్షనల్ మూవీ అని అందరిలో ఆసక్తి రేపిన జక్కన్న సినిమా చిత్రీకరణ ప్రారంభమైన నాటి నుంచి ఏ రోజుకారోజు కొత్త నిర్ణయాలను ప్రకటిస్తూ అందరిలోనూ ఉత్సుకతను పెంచుతున్నారు. ఇద్దరు హీరోలకు జోడిగా హాలివుడ్ నటి ఓలివియా మోరిస్ను, బాలివుడ్ నటి అలియాభట్ను ఎంపిక చేసి ఆశ్చర్యంలో ముంచెత్తిన రాజమౌళి
ఈసారి ఇంకో విషయంలోనూ సంచలనం రేపాడు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ 75 శాతం పూర్తికాగా త్వరలోనే పతాక సన్నివేశాలను విశాఖ మన్యంలో తీయాల్సి ఉంది. అయితే కొమురం భీంకు సంబంధించిన ఈ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించనున్నారు. అయితే ఆ పాటను రాయాలని ప్రజాగాయకుడు గద్దరును ఇటీవలే రాజమౌళి సంప్రదించాడని టాలివుడ్ టాక్. అంతేగాకుండా గద్దరే స్వయంగా పాడాలని కోరినట్లు సమాచారం. అందుకు ఆ యుద్ధనౌక కూడా ఆడిపాడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కొమురం భీం తెలంగాణవాడు కావడంతో ఆ పాట కోసం రాజమౌళి గద్దర్ను ఎంచుకున్నాడని టాలివుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఏదేమైనా గద్దర్ పాట రానుంది. ఆయన గతంలోనూ పలు చిత్రాలకు పాటలు రాశాడు. జైబోలో తెలంగాణ సినిమా కోసం రాసిన ‘పొడుస్తున్న పొద్దు మీద’ పాట ఎంతో ఫేమ్ అయింది కూడా. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరినీ ఉర్రూతలూగించింది. మరి ఈ పాట ఏ స్థాయిలో ఉంటుందో చూదాలి మరి.