సంచలనాలకు మారు పేరుగా నిలుస్తారు రామ్గోపాల్ వర్మ. ఆయన ఏది చేసిన ఒక ప్రత్యేక ఉంటుంది. సమాజాన్ని ఒక కుదుపు కుదిపిన సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. అదీగాక వాటికి ప్రచారం కల్పించడంలోనూ ముందుంటారు. ఇప్పటికే అనేక సార్లు అలా వార్తలకు ఎక్కారు. పలుసార్లు ఆయన వ్యాఖ్యలు వివాదాలకు కూడా కారణమయ్యాయి. కేసులు, కోర్టుల వరకు కూడా వెళ్లాయి. ఇటీవలే దేశంలో సంచలనంలో రేపిన ధిశా ఘటనపై సినిమా తీస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నా తన పంథాలో తాను పోతున్నాడు. తాజాగా ఏకంగా భారత్కు విచ్చేయనున్న ట్రంప్పైనే సెటైర్లు వేశారు మన ఆర్జీవీ. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఈ నెల 24న భారత్కు రానున్న విషయం తెలిసింది. సతీమణి మెలానీయా, కూతురు ఇవాంకతో కలిసి ఆయన భారత్లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేస్తున్నది. సుమారు రూ.100 కోట్లను వెచ్చిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ట్రంప్ కు ఘన స్వాగతం పలికేందుకు సుమారు కోటి మందికి పైగా ప్రజలు తరలివస్తారు అనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తనదైన శైలీలో స్పందించారు ఆర్జీవీ. తన ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్ర్తాలను సంధించారు. “ట్రంప్ పర్యటనకు నిజంగానే 10మిలియన్ల ప్రజలు రావాలంటే ఆయన పక్కన సన్నీలియోన్, దీపికాపదుకునే, అమితాబచ్చన్, కత్రీనాకైష్, సల్మాన్ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ఖాన్, రజినీకాంత్ వంటి వాళ్లను నిలబెట్టాలి” అని ఎద్దేవా చేశారు. ఆర్జీవీ చేసిన ఈ పోస్ట్ ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. పోస్టు చేసిన వెంటనే సుమారు 2000 మందికి పైగా దానికి లైకులు రావడం విశేషం.