మెగా, నందమూరి ఫ్యామిలీ మధ్య సినిమాల పరమైన వార్ ఉంటుందని.. ఈ రెండు కుటుంబాలకు పడదు అంటూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. ఇక బాలయ్యకు, చిరుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న పుకార్లు కూడా ఉన్నాయి. మరి కొందరు అయితే చరణ్కు, బాలయ్యకు పడదన్న ప్రచారం కూడా చేశారు. అయితే ఈ పుకార్లు పటాపంచలు చేసేశాడు రామ్చరణ్. నందమూరి అభిమానుల మనస్సులను గెలుచుకున్నాడు.
తాజాగా నిన్న హైదరాబాద్లో ఆ మహోన్నత నటుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. పలువురు సినీ, రాజకీయరంగ ప్రముఖులు ఈ వేడుకకి ప్రత్యేక అతిథులుగా రావడంతో వేడుక గ్రాండ్గా సక్సెస్ అయ్యింది. ముఖ్య అతిథుల్లో ఒకడిగా వచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ను ఏకంగా ఆకాశానికి మించి ఎత్తేశాడు.
ఎన్టీఆర్ లాంటి లెజెండ్స్ బాటను ఎప్పుడూ అనుసరించాలని చెప్పాడు. ప్రతిరోజూ తన సినిమాల షూటింగ్ టైంలో చాలా మంది ఆర్టిస్టులు ఎన్టీఆర్ జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఉంటారని చరణ్ గుర్తు చేసుకున్నాడు. తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత ఎన్టీఆర్దే అని చెర్రీ చెప్పాడు. ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి భాగమైన తెలుగు సినిమా పరిశ్రమతో తనకు అనుబంధం ఏర్పడడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.
ఇక తాను ఎన్టీఆర్ మనవడు అయిన పురందేశ్వరి కొడుకు కలిసి స్టేకింగ్ క్లాసులకు వెళ్లేవాళ్లమని నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనను కలిశానని.. ఆ సమయంలో బ్రేక్ఫాస్ట్ ఆయన ఎంజాయ్ చేస్తున్నట్టు గుర్తు చేసుకున్నాడు. అనంతరం ఆయన స్వయంగా తనకు భోజనం కూడా వడ్డించారని రామ్చరణ్ చెప్పాడు. ఆ క్షణాలను తాను ఎప్పటకి మర్చిపోలేనని చరణ్ తెలిపాడు.
ఇక ఆ మహోన్నత నటుడిని స్మరించుకునేందుకు ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడకు చరణ్ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే బాలయ్యను కూడా చరణ్ ఆకాశానికి ఎత్తేశాడు. ఆయన తమ ఫంక్షన్లను ఎప్పుడూ మిస్ చేసుకోరని, తనను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ఆయనకి ధన్యవాదాలు అని చరణ్ చెప్పాడు. ఇక చివర్లో జై ఎన్టీఆర్ అంటూ కార్యక్రమం ముగించాడు. ఏదేమైనా చరణ్ తన స్పీచ్తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానుల మనసుల్లో రియల్ హీరో అయిపోయాడన్న చర్చే ఇప్పుడు జోరుగా నడుస్తోంది.