నటరత్న ఎన్టీఆర్.. ‘కళ్లు మూసుకుని కనేది కల.. కళ్లతో అభినయించేది కళ.. నిద్రపోతూ కనేది కల.. నిద్రపోతున్న జాతిని మేల్కొలిపేది కళ.. అందుకే కళాకారులు సమాజాన్ని శాసిస్తున్నారు.. రాష్ట్రాలను ముఖ్యమంత్రులుగా ఏలగలిగారు’ అంటూ ‘నరసింహ నాయుడు’ లో నటసింహ నందమూరి బాలకృష్ణ చెప్పిన డైలాగ్ నందమూరి తారక రామారావుకి సరిగ్గా సరిపోతుంది.. కథానాయకుడిగా మొదలైన ప్రస్థానం ప్రజానాయకుడిగా మారడం వరకు తారక రాముడి జీవితంలో ఎన్నీ కీలక మలుపులు.. తెలుగు జాతి తెరమీద చూసిన రాముడు, కృష్ణుడు ఆయనే..తెలుగు వారి మనసుల్లో ఆరాధ్య దైవంగా నిలిచారు ఎన్టీఆర్.
1949లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘మనదేశం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్గా ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. పాత్రలో లీనమైపోయి లాఠీతో నిజంగానే కొట్టడం.. అప్పుడే నటనపట్ల ఆయనకున్న ఇష్టాన్ని దర్శకులు ప్రసాద్ గుర్తించడం లాంటి సంఘటనలు జరిగాయి. వీటినే బాలయ్య ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ లో ఆసక్తికరంగా చూపించారు.
అలా మొదలైన తారక రాముని నట ప్రస్థానం.. తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకుల హృదయాలను ఏలే చక్రవర్తిగా.. వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావుడిగా కొనసాగింది. ఇక సినిమాతో ఎన్టీఆర్తో పాటు లెజెండరీ మ్యుజీషియన్ ఘంటసాల, ప్రముఖ నేపథ్య గాయని పి.లీలకు కూడా ‘మనదేశం’ తొలి చిత్రమే.. ఈ చిత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని పి. లీల కూడా ఈ సినిమా ద్వారానే తెలుగు సినిమా రంగంలో నేపథ్యగాయనిగా ప్రవేశించారు.
తన తొలి చిత్రం మనదేశంకు ఎన్టీఆర్ అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.250లు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా రూపొందించిన ఎన్టీఆర్ సావనీర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక చిత్రానికి పదులకోట్ల రూపాయల్లో పారితాషికోన్ని నేటి హీరోలు తీసుకుంటున్నారు. అటువంటిది రూ.250ల పారితోషికంతో సినీ కెరీర్ ప్రారంభించిన ఎన్టీఆర్ వెండితెరను మకుటం లేని మహరాజుగా ఏలారు