ఆయన పేరు నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియదు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ఆయన ఎంచుకున్న రంగమే వేరు.. ఉపాధ్యాయుడిగా అడుగుపెట్టి అనంతకాలంలో పోటీ పరీక్షలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే మాస్టారుగా ఎదిగారు. ఆయనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ ఏడాది జనవరి 31 వరకు తెలుగుదేశం పార్టీతో కూడా సంబంధం లేదు. అలాంటి వ్యక్తి 40 రోజుల్లో ఎమ్మెల్సీ అయిపోయారు.. ఆయనే వేపాడ చిరంజీవి రావు.
కొత్త ఎమ్మెల్సీగా ఆరేళ్ల పాటు పెద్దల సభలో అత్యున్నత హోదాను అనుభవించనున్నారు. ఆయన కేవలం 40 రోజులు మాత్రమే ప్రచారం చేశారు. ఉత్తరాంధ్రలో తమకు తిరుగులేదని భావిస్తున్న వైసిపి అహంకారాన్ని అణగదొక్కి తెలుగుదేశం పార్టీ తరఫున సగర్వంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. గత ఎన్నికల్లో ఉత్తరంధ్రలో వైసీపీ దూకుడు దెబ్బతో తెలుగుదేశం పార్టీ కంచి కోటలు అన్నీ కుదేలు అయ్యాయి. అలాంటి చోట తెలుగుదేశం పార్టీకి ఊపిరిలూది తిరుగులేని ఘనవిజయం సాధించారు. చిరంజీవి రావు.
మూడు జిల్లాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. విద్యావేత్తగా సొంత బలం ఉంది. యువతతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఎంతోమందికి మూడు జిల్లాల్లో శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షల్లో నెగ్గేలా చూశారు. ఆయన ఎక్కువగా టచ్ లో ఉండేది నిరుద్యోగులతోనే.. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీని చేస్తే బాగుంటుందన్న ఆలోచన యువతకు రావటమే టిడిపికి కలిసి వచ్చింది. వాస్తవంగా టిడిపి ముందుగా ఒక బీసీ మహిళకు సీటు ఇచ్చింది. ఆమె వైజాగ్ కార్పోరేటర్.
అయితే అనూహ్యంగా చివరిలో ఆమెను పక్కనపెట్టి చిరంజీవి రావును ఎంపిక చేయటం ఆ పార్టీకి చాలా ప్లస్ అయింది. స్వతహాగా మంచి వ్యక్తి అయినా చిరంజీవి రావు సామాజిక వర్గం కూడా బలంగా ఉంది. దీనికి తోడు ఉత్తరంధ్రలో నిరుద్యోగులు, యువత అంతా కూడా వైసిపి మాటలు నమ్మలేదు. పైగా జగన్ ఉత్తరంధ్రను రాజధానిగా మార్చేస్తున్నాను.. త్వరలోనే తన ఆఫీసు కూడా ఇక్కడికి వస్తుందని ఎంత చెప్పినా వాళ్లంతా కర్ర కాల్చి వాత పెట్టినట్టు తీర్పు ఇచ్చారు.
ఇక వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి 6 నెలల క్రితం ప్రకటించబడ్డారు. పీడీఎఫ్ అభ్యర్థి కూడా చాలా రోజుల క్రితమే డిసైడ్ అయ్యారు. బిజెపికి సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ క్యాండిడేట్ గా ఉన్నారు. అయితే చిరంజీవి రావు మాత్రం కేవలం 40 రోజులకు క్రిందటే పార్టీలో చేరి ప్రణాళిక బద్ధంగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యి అత్యున్నత చట్టసభల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఏదేమైనా ఇది ఒక సామాన్యుడు విజయం గానే భావించాలి.