ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార వైసిపికి అదిరిపోయే షాక్ తగిలింది. కీలకమైన ఉత్తరాంధ్ర – తూర్పు రాయలసీమ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఉత్తరాంధ్ర నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన చిరంజీవి రావు 40 వేల ఓట్ల పైచిలుకు భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. అసలు వైసీపీ ఇక్కడ ఏ రౌండ్ లోను టిడిపి అభ్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది.
ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం ఏకంగా 14 శాతంగా ఉందంటే ఇక్కడ వైసిపిపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఘనవిజయం సాధించారు. కంచర్ల శ్రీకాంత్ వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి పై ఏకంగా 35 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
రాంగోపాల్ రెడ్డి ఒక సాధారణ నేత.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులకు చెందిన వ్యక్తి . ముందు నుంచి వీరి కుటుంబం టిడిపిలో ఉంటూ వస్తుంది. రాంగోపాల్ రెడ్డి స్వగ్రామంలో టిడిపికి తిరుగులేని పట్టు ఉంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఆ గ్రామంలో తెలుగుదేశం జెండా కదప లేకపోయారు. చంద్రబాబు అనూహ్యంగా ఇప్పుడు ఆయనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించగా.. ప్రచారం నుంచి దూసుకుపోయారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పులివెందుల నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థికి 4,323 ఓట్లు పోలవ్వగా.. వైసిపి అభ్యర్థికి 2,120 ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది.
దీనిని బట్టే జగన్కు పులివెందుల పట్టభద్రుల సైతం షాక్ ఇచ్చారన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోంది. ఏదేమైనా పులివెందుల అంటే ఒకప్పుడు జగన్ అడ్డా.. అక్కడ గత ఎన్నికల్లో జగన్ ఏకంగా 90 వేల ఓట్ల భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యేగా రికార్డులకు ఎక్కారు. అలాంటి చోట ఇప్పుడు యువతలోను… పట్టభద్రులను ఎలాంటి వ్యతిరేకత ఉందో ఈ ఫలితాలే నిదర్శనం కానున్నాయి.