సాధారణంగా.. నాయకుల పరిస్థితి ఈ రోజుల్లో ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటా రో తెలియదు. అసలు ప్రజలకు వారికి మధ్య ఏమేరకు అనుబంధం ఉందో కూడా అర్ధం కాదు. దీంతో నాయ కులకు.. ప్రజలకు మధ్య సంబంధాలు దాదాపు కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. ఈ తరహా పరిస్థితి కొందరు నాయకుల్లో మాత్రం కనిపించడం లేదు. ఒకప్పుడు.. ప్రజలతో మమేకమైన నాయకులు ఉన్నారు. ఇప్పుడు కేవలం ఓట్లకోసమే పరుగులు పెడుతున్న నాయకులు కనిపిస్తున్నారు.
కానీ, కాలం మారినా.. పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రజలతోనే అనుబంధం ఏర్పరుచుకున్న నాయకులు నేడు కూడా కనిపిస్తున్నారు. అలాంటి వారు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోనే ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. అయినప్పటికీ.. నిజం. ఈ పార్టీలోని కీలకమైన ముగ్గరు నాయకులకు ప్రజలతో మమేకమై.. తమ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. పార్టీ గెలిచిందా ఓడిందా ? మనం అధికారం పక్షంలో ఉన్నామా ? ప్రతిపక్షంలో ఉన్నామా ? అన్నది వాళ్లకు అనవసరం.
వాళ్లకు కావాల్సింది ప్రజలు… ప్రజలు.. ప్రజల కోసం ఏదొకటి చేయడం.. ఇంతకు మించి వీళ్లు ఆలోచించేది కూడా ఏం ఉండకపోవచ్చు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలో ఎవరో కాదు.. ప్రకాశం జిల్లా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఇదే జిల్లాలోని అద్దంకి నియోజవకర్గం ఎమ్మెల్యే గొట్టిపాటి రవి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఇప్పటి వరకు కూడా వీరికి ఓటమి అన్నది లేదు. అలాగని.. నిత్యం ఓట్లు.. ఎన్నికల రాజకీయాలు కూడా వీరు చేయరు.
అలాగని వ్యాపారాలు.. వ్యవహారాల్లోనూ మునిగి తేలరు. కేవలం ప్రజలు-కార్యకర్తలు-అభివృద్ది అనే మూడు దారుల్లోనే వీరు పయనిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉందా.. లేదా.. అనే విషయాలను పక్కన పెట్టడం వీరి ప్రత్యేకత. ప్రజల చేత, ప్రజల కోసం.. ప్రజల కొరకు అన్న.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణువణువునా నింపుకొన్న ఈ ముగ్గురు నాయకులను ఎవరు ఔనన్నా.. కాదనుకున్నా ప్రజలే వదులుకోరనే టాక్ వినిపిస్తూ ఉంటుంది.
ఎందు కంటే.. నాయకులకు ప్రజల అవసరం ఉందనే కామెంట్లు వినిపించే నేటి రోజుల్లో.. తమకు వీరి అవసరమే ఉందని ఆయా నియోజకవర్గాల ప్రజలు పదే పదే చెబుతుండడం గమనార్హం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ పక్కాగా అమలు చేశారు. అందుకే గత ఎన్నికలలో పార్టీ 23 సీట్లకు పరిమితం అయినా వీరు ముగ్గురు గెలిచారు.
పార్టీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే వీళ్లు నియోజకవర్గ ప్రజలను వదల్లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ల తమ తమ నియోజకవర్గాల ప్రజల కోసం పోరాటాలు చేస్తూ.. ఆపదలో ఆపన్నహస్తం అందిస్తూనే ఉన్నారు. మొత్తంగా.. నాయకుల్లో మేటి నాయకులుగా నిలుస్తున్న ఈ ముగ్గురికి తిరుగులేదని అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే అద్దంకిలో రేపటి ఎన్నికల్లో గొట్టిపాటి రవి ఐదో సారి గెలిచేందుకు, పర్చూరు, పాలకొల్లులో ఏలూరి, నిమ్మల హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.