పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడిపి బలపరిచిన ఆ పార్టీ నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇది తెలుగుదేశం పార్టీకి పెద్ద ఊరట. వైసీపీకి అడ్డాగా పేరున్న రాయలసీమలో.. అది కూడా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప కూడా ఉన్న ఈ నియోజకవర్గంలో భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి గెలుపు పెద్ద సంచలనం. ఇంకా చెప్పాలంటే రాంగోపాల్ రెడ్డి సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన వ్యక్తి అవడంతో ఈ గెలుపుకు విపరీత ప్రాధాన్యం ఏర్పడింది.
పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలానికి చెందినవారు రాంగోపాల్ రెడ్డి. చాలా నెలల తర్వాత పులివెందుల పూల అంగళ్ళలో తెలుగుదేశం పార్టీ సంబరాలు మామూలుగా జరుపుకోవడం లేదు. ఈ విజయం నిజంగా అటు జగన్తో పాటు అధికార వైసిపికి పెద్ద షాక్ లాంటిది. రాష్ట్రవ్యాప్తంగానే తమకు తిరుగులేదని చెప్పుకుంటున్న వైసీపీకి సీఎం జగన్కు సొంత నియోజకవర్గంలోనే ఘోర పరాభవం ఎదురు కావడంతో వైసిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే వైయస్ ఫ్యామిలీకి కంచు కోటగా ఉన్న పశ్చిమ రాయలసీమలో గతంలో జగన్ తండ్రి వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టీడీపీయే గెలిచింది. అప్పుడు టీడిపి నుంచి పోటీ చేసిన ఆ పార్టీ నాయకుడు ఎంవీ శివారెడ్డి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ప్రముఖ న్యాయవాది వేణా అజయ్ కుమార్ పై శివారెడ్డి ఘనవిజయం సాధించారు.
అలా తమ సొంత కంచుకోటలోనే నాడు తండ్రి వైయస్, నేడు కొడుకు జగన్ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీని టచ్ చేయలేకపోయారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరి ఇదే జోరు వచ్చే సాధారణ ఎన్నికల్లో కొనసాగిస్తే రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.