కరోనా పీక్స్ స్టేజ్లో ఉండి ఊపిరి ఆడని సమయంలో ఆక్సిజన్ సిలిండర్ దొరికితే ఎలా ? ఉంటుందో… మండే ఎండల్లో వానలు కురిసినట్టు… ఎడారిలో చల్లని వాటర్ దొరికినట్టుగా చంద్రబాబుకు తాజాగా జరిగిన పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త ఊపిరిని ఇచ్చాయి. అసలు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది… అసలు ఒక్కచోట కూడా గెలవదు, కుప్పంలోనూ చంద్రబాబుని ఓడిస్తాం.. అని అధికార వైసిపి సవాళ్లు విసురుతున్న సమయంలో ఏకంగా మూడు పట్టభద్రుల స్థానాల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదు.
చంద్రబాబు ప్రచారం చేయకుండానే ఇంత భారీ విజయం రావడం మామూలు విషయం కాదు. చంద్రబాబుకు ఇది కచ్చితంగా బిగ్ రిలీఫ్. ఎన్నికల ముందు వచ్చిన ఫలితాలు చంద్రబాబుకు భవిష్యత్తులో మరిన్ని నిర్ణయాలు తీసుకోవటానికి ఎంతైనా ఉపయోగపడతాయి. తాజా ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేదు… టిడిపి ఒంటరిగానే పోటీ చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న ఆ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఒక ప్రకటన కూడా చేయలేదు.
అయితే వామపక్షాలు మాత్రం నేరుగానే బలపరిచాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు టీడీపీకే వేయమని చెప్పాయి. అయితే పట్టభద్రుల్లో వామపక్ష పార్టీలకు అంత ఓటు బ్యాంకు కూడా లేదన్నది వాస్తవం.
దీనిని బట్టి టీడిపి సొంత బలంతోనే విజయం సాధించినట్లయ్యింది. తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ అవ్వటానికి ఇది ఎంతైనా ఉపయోగపడుతుంది. ఇక నిన్న మొన్నటి వరకు చంద్రబాబు పని అయిపోయిందని.. జనసేన అయినా మరో పార్టీ అయినా చంద్రబాబును ఆడిస్తాయి అంటూ రకరకాలుగా ప్రచారాలు జరిగాయి.ఇప్పుడు సీన్ మారింది చంద్రబాబు ఒకళ్ళ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. జనసేన అయినా మరో పార్టీ అయినా చంద్రబాబు చెప్పినట్టు వినాల్సిందే. కష్ట సమయంలో వన్ సైడ్ విక్టరీ టీడిపి సొంతమయింది.
ఇక చంద్రబాబుకు ఎవరితోనూ బేరాలు లేవు. జనసేనకు పొత్తు, సీట్లు కావాలంటే ఆ పార్టీకి బలం ఉన్నచోట మాత్రమే సీట్లు ఇస్తారు. అది 20 కావచ్చు 25 కావచ్చు. ఇక తెలుగుదేశం పార్టీలోనే కొందరు నేతలు నిన్న మొన్నటి వరకు అసలు పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా ? అని సందేహాలు వ్యక్తం చేయడంతో పాటు.. బాబు దగ్గర కూడా తల ఎగరేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పటాపంచలు అయిపోయాయి. పార్టీలో ఎవరైనా తోక జాడిస్తే కట్ చేయడానికి బాబు రెడీ గానే ఉన్నారు. ఇక ఇప్పుడు పార్టీలో చేరికలు కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి. చంద్రబాబు కండువాలు కప్పడంలో బిజీబిజీ అవుతున్నారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీని తక్కువ అంచనా వేయవద్దని చంద్రబాబు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో గట్టి సంకేతాలు అయితే పంపేశారు.