టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ హీరోగా విలక్షణ దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమా అహింస. గీతిక తివారి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సదా ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాతో రానా సోదరుడు అభిరమ్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటినుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలకు రెడీగా ఉంది. వచ్చేనెల రెండో తేదీన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంటే చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోని రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా తీయటం అనేది తన డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటని తేజ చెప్పుకొచ్చాడు.
సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ రూపొందించాలని అప్పుడు అనుకున్నాను.. రూపొందించే ఉద్దేశ్యంతో ప్రకటన కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల బయోపిక్ ను వదిలేశాను.ఆ సమయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అనిపించింది.. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పడు కూడా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాను. అయితే అది సినిమాల కాకుండా సిరీస్ రూపంలో తీసుకు వస్తాం అంటూ తేజ ప్రకటించాడు.
అయితే ఎన్టీఆర్ పాత్రలో ఏ నటుడినైనా నటింపజేయడం చాలా కష్టం. అందుకే, నందమూరి తారక రామారావు మనవడు హరికృష్ణ కొడుకు ఎన్టీఆర్ ఈ పాత్రకు సరిపోతాడు. ఎందుకంటే అతడు లెజెండ్ లాగా కనిపిస్తాడు. ఆయన ఆ పాత్రకు సరైన ఎంపిక జూనియర్ ఎన్టీఆర్ అని భావిస్తున్నాను అని తేజ తెలిపారు. అయితే ఈ సిరీస్ ఎప్పుడు మొదలు అవుతుంది అనేది ఆయన క్లారిటీ ఇవ్వలేదు.