టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయాత్రకు 100 రోజలు పూర్తికానున్నాయి. వాస్తవానికి డేట్ ప్రకారం చూసుకుంటే.. 100 రోజులు పూర్తయ్యాయి. కానీ, మధ్యలో కొన్నికారణాల రీత్యా.. సెలవులు ఇవ్వడంతో ఈయాత్ర బ్రేకులు పడింది. ఎట్టకేలకు 100 రోజులకు చేరువ అయింది. అదేసమయంలో యాత్రలో నిర్దేశించుకున్న 4000 కిలో మీటర్ల లక్ష్యం కూడా.. వడివడిగా సాగుతోంది. ఇప్పటికే 1200 కిలో మీటర్ల దూరం పూర్తయింది.
అయితే.. ఇప్పటి వరకు జరిగిన యువగళం పాదయాత్రను గమనిస్తే.. ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. వాస్తవానికి ఈ యాత్రద్వారా యువతకు చేరువ కావడం.. గ్రామీణ స్థాయిలో నారా లోకేష్ను ప్రజలకు చేరు వ చేయడం అనే లక్ష్యాలు ఉన్నాయి. అయితే.. వీటితోపాటు.. నారా లోకేష్ మరింత దూకుడు ప్రదర్శిం చారు. ప్రజలకు చేరువ కావడంలో ఆయన చాలా చొరవ తీసుకున్నారనే చెప్పాలి. అదేసమయంలో యువతను కూడా అక్కున చేర్చుకున్నారనేది నిర్వివాదాంశం.
ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతోపాటు.. ప్రజాసమస్యలపైనా అదేసమయంలో దృష్టి పెట్టారు ఇక, ఏ జిల్లాకు వెళ్తే.. ఆ జిల్లాలో అనేక హామీలను గుప్పించారు. ముఖ్యంగా వడ్డెరలకు ఎస్టీ రిజర్వేషన్లు, అదేవిధంగా ముస్లిం యువతులు చుదువుకునేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ ఒక కళా శాల ఏర్పాటు.. బీడీ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం వంటివి తీసుకువస్తామని చెప్పారు.
ఇక, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం ద్వారా.. సీమ ప్రజల డిమాండ్కు న్యాయం చేస్తున్నారనే వాదన వచ్చింది. ఇక, యువగళం కార్యక్రమం ద్వారా.. అంతర్గత సమావేశాల్లో పార్టీని డెవలప్ చేసే వ్యూహాలకు కూడా నారా లోకేష్ పదును పెట్టారు. అంతర్గత కుమ్ములాటలను తగ్గించడంతోపాటు.. నేతలపై సరైన దారిలో నడిపించేందుకు కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటి వరకు చిత్తూరు, అనంతపురం, కర్నూలులో సాగిన పాదయాత్రకు భారీగా జనాలను సమీకరించడంలోనూ.. వారిని ఆకట్టుకునే ప్రసంగించడంలోనూ.. వైసీపీ నాయకులకు సవాళ్లు రువ్వడంలోనూ.. నారా లోకేష్ దూకుడుగా ముందుకు సాగారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు మినహా 100 రోజుల యాత్ర నిర్విఘ్నంగా సాగిందని అంటున్నారు పార్టీ సీనియర్లు.