సీపీ నగరి ఎమ్మల్యే, సినీ నటి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలను చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నటులు బాలకృష్ణ, పవన్కల్యాణ్పై ఫైర్ అయ్యారు. ఇటీవల వారు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఫైర్ బ్రాండ్. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని మండిపడుతూ ఇటీవలే హిందూపురం పర్యటనకు వెళ్లిన బాలకృష్ణను అక్కడి వైసీపీ నేతలు, ప్రజలు అడ్డుకున్నారు. దీనిపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కనుసైగ చేస్తే అంతే అంటూ వైసీపీని హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై రోజా తాజాగా స్పందించారు. తండ్రి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు కనుసైగ చేసి బుద్ధి చెబితే బాగుండేదని ఆమె కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ నుంచి బాలయ్యను తరిమికొట్టే రోజు వస్తుందని తెలిపారు.
అదేవిధంగా ఫవన్కల్యాణ్పైనా రోజా విరుచుకుపడ్డారు. వైసీపీ సర్కారు అన్నీ చీకటి జీవోలనే జారీ చేస్తున్నదని ఆయన ట్విట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్కు అసలు జీవో ల గురించే తెలియదని ఎద్దేవా చేశారు. గుడ్డిగా కావాలనే పనిగట్టుకుని విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్పై రోజా ధ్వజమెత్తారు. కుమారుడి రాజకీయ భవిష్యత్ సమాధి అవుతుందనే మండలి రద్దును చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పెద్దల సభకు పెద్దలను కాకుండా దద్దమ్మలను తీసుకొచ్చారని లోకేష్ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. అనంతరం సీఎం జగన్ ఏపీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.