గుంటూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. మరీ ముఖ్యంగా.. కీలకమైన పెదకూర పాడు నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య రాజకీయాలు మరింత జోరందుకున్నాయి. టీడీపీ ముఖ్య నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్… తన విశ్వరూపం చూపించారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లని పేర్కొన్న ఆయన.. వారికి ఏమాత్రం సహకరించని.. ఎమ్మెల్యే నంబూరు శంకరరావును తరిమి కొట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని అన్నారు.
నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దోపిడీ ఎమ్మెల్యే నంబూరు కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన ఆధారాలతో సహా ఆరోపించారు. ఇసుక దోపిడీ, మట్టి మాఫియాకు ఎమ్మెల్యే శంకరరావు బాధ్యత వహించా లని నిప్పులు చెరిగారు. దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే నంబూరి.. అభివృద్ధి నిరోధకంగా మారారని, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించారని ఆరోపించారు.
గతంకంటే బాగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని, ఇసుక, మట్టి మాఫియాకు పాల్పడలేదని ఎమ్మెల్యే చెబుతూ.. సవాల్ విసిరారని.. ఆ సవాల్ను తాను కూడా స్వీకరించానని చెప్పారు. ప్రజల తరఫున పోరాటం చేసే విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని, గతంలో ఏం జరిగిందీ.. ఇప్పుడేం జరుగుతుందీ.. వాటన్నింటిపై చర్చకు తాము సిద్ధమని శ్రీధర్ మరోసారి స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగింది?
అమరావతి మండలం ముత్తాయపాలెం గ్రామం పరిధిలోని కృష్ణానదిలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతోందనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఇసుక రీచ్ ని సందర్శించారు. స్థానికంగా పెద్ద ఎత్తున వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన ఇక్కడ పర్యటించారు. కృష్ణానదిలో అనధికారకంగా,పెద్ద ఎత్తున రహదారులు వేసి, అధికార పార్టీ ఎమ్మెల్యే నంబరు శంకర్రావు ఆధ్వర్యంలో అక్రమంగా ఇసుక రవాణా చేసుకుంటున్నారని టీడీపీ నేతలు సైతం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
రెండు రోజుల క్రితం, కృష్ణా నదిలో స్నానానికి వెళ్లిన ఇరువురు విద్యార్థులు చనిపోయారు. కృష్ణా నదిలో ఇసుక అక్రమ రవాణా వల్లే చనిపోయారని కొమ్మాల పాటి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు.. తనకు ఏమి సంబంధం అంటూ.. పొంతనలేని సమాధానం చెబుతూ, ఇసుక విష యం గురించి, తనకేమీ తెలియదని చెప్పడం పట్ల కొమ్మాలపాటి నిలదీశారు. లేనిపోని, వ్యాఖ్యలు చేస్తూ.. నంబూరు శంకర్రావు మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు.
ప్రజల తిరగబడే రోజులు వచ్చాయని, ప్రజలే బుద్ధి చెబుతారని కొమ్మాలపాటి అన్నారు. ప్రజల తీర్పుకు, ఎవరైనా శిరసా వహించాల్సిందేనని అన్నారు. అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు, అధికారం శాశ్వతం కాదని.. ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఇసుక విషయంలో ఎవరు మాట్లాడినా, పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.
ఒక్కళ్లతో కూడా మాట పడలేదు..
20 సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను ఒక్కరితోనూ మాట పడలేదని కొమ్మాల పాటి వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా తాను ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. రాజకీయాన్ని రాజకీయంగా చూశారే తప్ప.. వ్యక్తిగత కక్షలతో ఏనాడూ.. శ్రీధర్ ఎవరినీ బాధ పెట్టలేదని నియోజకవర్గంలో చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు శంకర్రావు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, కేసులు పెట్టించడం లాంటి పరిణామాలపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోన్న వాతావరణమే ఉందన్న టాక్ ఉంది.