తెలంగాణలో మరో ఏడెనిమిది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాజకీయం వేడెక్కింది. సీఎం కేసీఆర్ సిటింగులకే మరోసారి టిక్కెట్లు ఇస్తాను అని ప్రకటించిన బీఆర్ఎస్ నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సైతం వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడిన వెంటనే 2014 ఎన్నికలలో నిజామాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఎంపీగా గెలిచిన కవిత.. 2019 లోక్ సభ ఎన్నికలలో బిజెపి నుంచి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.
ఐదు నెలల ముందు జరిగిన సాధారణ ఎన్నికలలో నిజామాబాద్ లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించినా.. లోక్సభకు వచ్చేసరికి కవిత ఏకంగా 90,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత కవిత చాలా రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ పట్టుబట్టి ఆమెను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయించి మండలికి పంపారు.
ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే వచ్చే సాధారణ ఎన్నికలలో ఆమె లోక్సభకు పోటీ చేసేందుకు ఆసక్తిగా లేనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె కన్ను నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సీటుపై పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ నుంచి బిగాల గణేష్ గుప్తా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే కవిత కన్ను అర్బన్ అసెంబ్లీ సీటుపై పడడంతో ఆయనకు షాక్ తప్పదా ? అన్న చర్చలు నిజామాబాద్ జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సైతం ఇదే సీటు నుంచి పోటీ చేసేందుకు తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆమె మహిళా కోటతో పాటు మున్నూరు కాపు కోటాలో టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే కవిత నేరుగా పోటీ చేస్తే ఎవరైనా తప్పుకోవాల్సిందే. కవిత ఈసారి మాత్రం ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలని లోక్సభకు వెళ్లినా రాజకీయంగా తనకు కలిసి వచ్చేది ఏం ? లేదన్నా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషించాలంటే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే అని కవిత బలంగా ఫిక్స్ అయినట్టు సమాచారం. మరి కవిత నిర్ణయం ఎలా ? ఉన్న కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి.