ఏపీలో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసీపీ అభ్యర్థులు ముగ్గురు ఓడిపోయారు. జగన్ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నాలుగైదు నెలల ముందే మూడు నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. అధికార పరంగా చూస్తే తిరుగులేని బలం… బలగం ఉంది. ఆర్థిక బలం కూడా ఉంది దీంతో వైసిపి అభ్యర్థులు గెలుపు నల్లేరు మీద నడకే అని అందరూ భావించారు.
రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు ఓటమి అంచుల్లోకి వెళ్లి గెలిచారు. ఇక గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల విషయానికొస్తే తూర్పు రాయలసీమ, ఉత్తరంధ్రల్లో వైసిపి అభ్యర్థులు అసలు ఊహించని విధంగా ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో కూడా టిడిపి అభ్యర్థి అంచనాలకు మించి విజయం సాధించారు.జగన్ ఈ పరాజయాన్ని మంత్రుల ఖాతాలో వేస్తారంటూ ముందు నుంచి ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు బాధ్యతలను కూడా జగన్ మంత్రులకే అప్పగించారు.
అయితే ఇప్పుడు ఈ ఓటమితో మాకు సంబంధం లేదని చాలా తెలివిగా ఎస్కేప్ అవుతున్నట్టు కనపడుతుంది. మూడు ప్రాంతాలకు ముగ్గురు కన్వీనర్లను జగన్ నియమించారు.ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి మరొకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ ముగ్గురు కూడా జగన్కు అత్యంత ఆప్తులే. తనకు నమ్మకమైన నేతలే కన్వీనర్లుగా ఉండడంతో జగన్ కూడా వారిని బాగా నమ్మారు అయితే వీరు జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించలేదు. జగన్ కు ఎలాగూ విభేదాలను పరిష్కరించే సమయం, తీరిక రెండూ లేవు.
అందుకే ఆ ముగ్గురు మీద భారం పెట్టేసారు. వీరు జిల్లాలలో పార్టీ నేతల మధ్య ఉన్న గ్యాప్ ను పరిష్కరించలేదు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునాతిరే అన్నట్టుగా ఉన్నారు. దీంతో ఇప్పుడు పార్టీకి ఘోరపరాజయం తప్పలేదు. ఏదేమైనా మంత్రులు ఈ ఓటమిని తమ ఖాతాలో వేసుకునేందుకు ఎంత మాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది. పార్టీ కన్వీనర్ల మీద నెట్టేసె ఆలోచనలోనే వీరంతా కూడపలుక్కుని మరి ఉన్నారట.