ఉత్తరాంధ్ర అంటే.. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం పెంచేసిన వైసీపీ అధినేత జగన్కు.. ఇప్పుడు భారీ షాక్ తగిలింది. విశాఖను రాజధాని చేస్తున్నాం.. మాకు తిరుగు లేదని పదే పదే అంతర్గత సమావేశాల్లో చెప్పిన జగన్.. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఘోర పరాజయంతో ఒకింత ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. రాజధానిని ప్రజలు కోరుకోవడం లేదనే వాదన ఇప్పుడు తెరమీదికి వచ్చింది.
అయితే.. ఈ ఓటమిని ముందుగానే అంచనా వేయడంలో పార్టీ అధినేత సహా సీనియర్లు విఫలమయ్యార ని.. మరో వాదన వినిపిస్తోంది. ఎలాగంటే.. ఉత్తరాంధ్రపై దాదాపు 7 సంవత్సరాలుగా పట్టు బిగించిన సాయిరెడ్డిని కాదని.. వైవీ సుబ్బారెడ్డికి పగ్గాలు అప్పగించారు. ఈయనకు ప్రకాశం, నెల్లూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలపై ఉన్న పట్టు.. ఇక్కడి రాజకీయ నేతలపై ఉన్న అవగాహన ఉత్తరాంధ్రపై లేదనేది వాస్తవం.
అయినప్పటికీ.. సాయిరెడ్డిని తప్పించాలనే ఒక కీలక సలహాదారు సూచనలు.. కొన్ని ఆరోపణల కారణంగా సాయిరెడ్డి హవాను తగ్గించారు. ఇది ఎమ్మె ల్సీ ఎన్నికలలో ప్రభావం చూపించిందనేది వాస్తవం. పైగా వైవీ రాజకీయాలకు.. సాయిరెడ్డి వ్యూహాలకు చాలా తేడా ఉంది. సాయిరెడ్డి అవసరమైతే.. నాలుగు మెట్లు దిగి.. తన పనిని పూర్తి చేసుకునే లక్షణం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు.
విశాఖ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నేరుగా ఆయన పాదయాత్ర చేయడం దీనిని నిదర్శనం.
కానీ, వైవీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయలేక పోయారు. ఏదో నలుగురు నాయకులను ఒక హోటల్ కు పిలిపించుకుని వారితో చర్చించి.. అదే నిజం అనుకున్నారు. ఫలితంగా సమన్వయ లోపం.. సహా.. పార్టీని ముందుకు నడిపించడంలోనూ ఆయన విఫలమయ్యారు. దీంతో చేతులు కాలిపోయాయి.
ఇక సాయిరెడ్డికి కాస్త ప్రాధాన్యం తగ్గించి సుబ్బారెడ్డి, విజయసాయికి ప్రాధాన్యం పెరిగిందన్న ప్రచారంతో సాయిరెడ్డి కాస్త సైలెంట్ అవ్వడం కూడా పార్టీకి దెబ్బపడింది. మరి ఇప్పుడు మరోసారి సాయిరెడ్డికే పగ్గాలు అప్పగిస్తారా ? లేక ఏదైతే అదే అవుతుందని మిన్నకుంటారా? అనేది చూడాలి.