ఏపీలో వచ్చేసాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన మధ్య పొత్తు ఉంటుందని రెండు పార్టీల నేతలు దాదాపు ఫిక్స్ అయిపోయారు. పవన్ కూడా జనసేన పదో ఆవిర్భావ సభలో పరోక్షంగా టిడిపి తో పొత్తు ఉంటుందని సంకేతాలు ఇచ్చేశారు. జనసేన – టిడిపి పొత్తు ఉంటే జనసేనకు పొత్తులో భాగంగా 25 కు తగ్గకుండా అసెంబ్లీ సీట్లతో పాటు.. 5 ఎంపీ సీట్లు ఇస్తారని కూడా టాక్ లు వస్తున్నాయి. తెలుగుదేశం నేతల అంతర్గత సంభాషణలోనూ జనసేనతో పొత్తు ఖాయమని.. మన పార్టీ నుంచి కొందరు నేతలు టిక్కెట్ల త్యాగాలకు సిద్ధంగా ఉండాలని కూడా చర్చకు వస్తోంది.
జనసేనకు ప్రధానంగా ఆ పార్టీ బలంగా ఉన్న.. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే సీట్ల కేటాయింపు ఉంటుందని అంటున్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలలో రెండేసి సిట్లతో పాటు ఉభయగోదావరి.. విశాఖ జిల్లాలో జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వవచ్చని తెలుస్తోంది. అలాగే ప్రకాశం జిల్లాలోనూ దర్శి సీటు జనసేనకు ఇవ్వవచ్చని అంటున్నారు. అనంతపురం జిల్లాలోనూ అనంతపురం అర్బన్ లేదా గుంతకల్ సీటు జనసేనకు ఇస్తారని తెలుస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ కూడా ఉభయగోదావరి జిల్లాలలో నరసాపురం లేదా పిఠాపురంలో ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేస్తారని జనసేన పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాజధాని జిల్లా అయిన గుంటూరు జిల్లాలో ఈసారి తెలుగుదేశం పార్టీ బాగా ఆశలు పెట్టుకుంది. రాజధాని వికేంద్రీకరణతో పాటు అనేక కారణాలతో ఈసారి గుంటూరు, కృష్ణ జిల్లాలు తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా విజయం కట్టబెట్టబోతున్నాయని పలు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
దీంతో ఈ రెండు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు టిక్కెట్ వస్తే చాలు కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో ఉంటామని ధీమాతో ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో జనసేనతో పొత్తు కొందరి టిడిపి నేతలు సీట్లకు ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. జనసేనతో పొత్తు ఉంటే కచ్చితంగా ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కోసం తెనాలి సీటును టీడిపి త్యాగం చేయాలి. ఇక్కడి నుంచి పోటీకి రెడీగా ఉన్నా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మరో నియోజకవర్గం వెతుక్కోక తప్పదు.అలాగే జిల్లాలోని సత్తెనపల్లి సీటు కూడా పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వాలని తెలుస్తోంది. ఇక్కడ నుంచి గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన బైరా దిలీప్ చక్రవర్తి ఈసారి జనసేన అభ్యర్థిగా బరిలో ఉంటారు.
అంటే టీడిపి నేతలు సత్తెనపల్లి – తెనాలి సీట్లు త్యాగం చేయాలి. ఒకవేళ ఆలపాటి రాజా గుంటూరు పశ్చిమంకు వెళదామన్న అక్కడ కూడా దారులు మూసుకుపోతున్నాయి. టీడిపిలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. ఆ సీటు జనసేనకు ఇస్తే కన్నాకు గుంటూరు వెస్ట్ సెకండ్ ఆప్షన్ గా ఉంది.గతంలో ఆయన అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు సత్తెనపల్లిలో పోటీ చేయలేని ఆశపడుతున్న కోడెల శివరాం తనయుడు కోడెల శివరాంతో పాటు ఆలపాటి రాజా లాంటి నేతలు సీట్లు త్యాగం చేయక తప్పదు. అదే జరిగితే వీరి రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని చెప్పాలి. ఏదేమైనా జనసేనతో పొత్తు ఉంటే టీడిపిలో కొందరు కీలకనేతలు త్యాగాలకు సిద్ధపడక తప్పని పరిస్థితి.