తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, యువ నేత నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర నేటికి 100 రోజులకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించిన ఈ యాత్ర చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12వందల 68.9 కిలో మీటర్ల మేరకు పాదయాత్ర పూర్తి చేశారు.
మొత్తం 4 వేల కిలోమీటర్ల దూరాన్ని పాదయాత్ర చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సెల్ఫీ విత్ లోకేష్ కు ప్రజల నుంచి స్పందన వస్తోంది. అదేవిధం గా వివిధ వర్గాల ప్రజలను నారా లోకేష్ కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. పలు అంశాలపై వారితో చర్చిస్తున్నారు. ఇదిలావుంటే, యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లోనూ సంఘీభావ పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించడం విశేషం.
మరోవైపు.. జనవరి 27న ప్రారంభమైన ఈ యువగళం పాదయాత్రకు అనేక ఇబ్బందులు వచ్చాయి. పోలీసులు తొలినాళ్లలో అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనేక సందర్భాల్లో నారా లోకేష్ ప్రసంగిస్తున్న మైకులను ఎత్తుకుపోయారు. చివరకు ఆయన స్టూల్పై నిలబడి మాట్లాడడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇక, కార్యకర్తలపై లాఠీ చార్జి చేశారు. కనీసం.. తమకు భద్రత కూడా కల్పించడం లేదని నారా లోకేష్ విమర్శలు గుప్పించినా.. పోలీసులు పట్టించుకోలేదు.
అయినప్పటికీ.. యాత్రను మాత్రం నిర్విరామంగా కొనసాగించారు. అనేక సంఘాల నుంచి మద్దతు సంపాయించుకున్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోయారు. సమస్యలపై స్పందించారు. అన్ని వర్గాలకు అండగా ఉంటామని చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నారా లోకేష్ ఎక్కడికక్కడ ఎండగట్టారు. మంత్రుల అవినీతి, ఎమ్మెల్యేల అరాచకాలపై ఆయన స్పందించిన తీరుకు ప్రజల నుంచి అభినందనలు వచ్చాయి. మొత్తంగా చూస్తే.. పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడంలో నారా లోకేష్ దూకుడుగా ముందుకు సాగుతుండడం గమనార్హం.