ఏపీలో జగన్మోహన్ రెడ్డిని 2019 ఎన్నికలలో గెలిపించడంలో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీం ఎంత బలంగా పనిచేసిందో చూశాం. చంద్రబాబుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని చూపించడంలో ఐప్యాక్ టీం బాగా సక్సెస్ అయింది. ఇక ఇదే ఐప్యాక్ టీం ఇక 2024 ఎన్నికలలోను వైసీపీని గెలిపించేందుకు ఐ ప్యాక్ టీంకు జగన్ ప్రభుత్వం నిధులు వెల్లువలా పారిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే గత ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితి వేరు. వైసిపి ప్రతిపక్షంలో ఉండడంతో జగన్ కూడా పూర్తిగా పీకే టీం సర్వేలనే బాగా నమ్ముకున్నారు.
ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. అయితే వీరికి తెలియకుండానే వీరి నియోజకవర్గాల్లో పార్టీ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవటం ఎవరికి నచ్చటం లేదు. అసలు పీకే టీం నుంచి ఎవరు కూడా తమను కలవడం లేదని.. వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా నియోజకవర్గంలో మండల స్థాయి నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారని.. వారిలో కొందరు తమకు వ్యతిరేకంగా రిపోర్టులు ఇస్తున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు.
తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐప్యాక్ టీం చాలా నేలబారుడు వ్యవహారాలను అమలు చేసిందని వైసిపి అధినాయకత్వం తీవ్రంగా మండిపడుతుందట. ఓటర్లను డబ్బులు ఇచ్చి కొనడంతో పాటు.. ఫేక్ ఓట్లు చేర్పించటం, పోలింగ్ వేళ అవకతవకలకు పాల్పడడం.. ఇలా ఏదో ఒకటి చేస్తే ఓట్లు అన్ని గంప కొత్తగా వైసీపీ ఖాతాలో పడిపోతాయని ఐ ప్యాక్ టీం చెత్త సలహాలు ఇచ్చిందని అంటున్నారు. కట్ చేస్తే ఫైనల్ గా వైసీపీకి దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది. ఇంత దారుణ పరాజయంపై వైసీపీ అధినేత జగన్ కూడా మండిపడుతున్నారట. గత రెండేళ్లుగా విద్యావంతులలో, మేథావుల్లో మార్పు కనిపిస్తోంది.
అలాంటప్పుడు వారి కోపాన్ని గుర్తించి తగిన విధంగా సలహాలు ఇవ్వాలని పనికిమాలిన చెత్త సలహాలతో పార్టీ కొంప ముంచేసారని.. జగన్ పీకే టీం సభ్యులపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు పీకే టీం సభ్యులు తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వైసిపి నేతలు కూడా మండిపడుతున్నారు. దీంతో వారంతా పీకే టీం మీద ఉత్తరాదిలో ఉన్న ఓ సెటైర్ బాగా పేలుస్తున్నారు. ఆయన ఎప్పుడు గెలిచే పార్టీకే స్ట్రాటజీలు ఇస్తారని.. ఆ గెలుపులో క్రెడిట్ అప్పనంగా వేసుకుంటారని … ఏటికి ఎదురీదే పార్టీలకు వ్యూహాలు ఇచ్చి గెలిపించిన దాఖలాలు లేవని వైసీపీ పెద్దలే విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా జగన్ ఈసారి పీకే టీమ్ని నమ్ముకుని 2024 ఎన్నికలకు వెళితే మునిగిపోవడం ఖాయమని ఆ పార్టీ నేతల్లోనే చేర్చ నడుస్తోంది.